గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (17:20 IST)

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌: శ్రీనివాసన్‌కు సంబంధం లేదన్న సుప్రీం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్‌ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. బెట్టింగ్‌లో ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సంబంధం లేదని ధర్మాసనం తెలిపింది. శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌, రాజ్‌కుంద్రా ఫ్రాంచైజీ కో ఓనర్లే అని తేల్చిచెప్పింది. 
 
శ్రీనివాసన్‌కు బెట్టింగ్‌తో సంబంధం లేకపోయినా ఆయన అల్లుడు గురునాథ్‌కు ప్రమేయం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 17 నెలల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. తద్వారా గత ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు క్లీన్ చిట్ లభించింది.
 
ఈ కేసులో శ్రీనిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, సాక్ష్యాలతో రుజువుకాలేదని పేర్కొంది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా కోర్టు 130 పేజీలతో తీర్పు వెలువరించింది. 
 
మరోవైపు ఇదే సమయంలో శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఈ మాజీ అధ్యక్షుడిని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాలని బోర్డును ఆదేశించింది. అటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ నుంచి ఉద్వాసన పలికింది.