శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:32 IST)

నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు కూడా దూరమైన ఇషాంత్ శర్మ!

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే మూడో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన ధోనీ సేనకు.. ఆ ఓటమి బాధ నుంచి తేరుకోక ముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. సౌతాంఫ్టన్ టెస్ట్ మ్యాచ్‌కు దురమైన ఇషాంత్ శర్మ.. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగే మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. 
 
ఇషాంత్ ఇంకా మడమ గాయం నుంచి కోలుకోలేదని కెప్టెన్ ధోనీ మీడియాతో చెప్పాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ మ్యాచ్‌కు అతను ఫిట్నెస్ సాధించలేడన్న విషయం రూఢీ అయిందని, ఈ విషయంపై చర్చించాల్సి ఉందని తెలిపాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఇషాంత్ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయడం తెలిసిందే. 
 
అయితే, గాయం కారణంగా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో జట్టులోకొచ్చిన రాజస్థాన్ పేసర్ పంకజ్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో ధోనీ ఎవరిని బరిలో దింపుతాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇషాంత్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు కూడా దూరం కావడమంటే.. ఖచ్చితంగా మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే.