శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (22:29 IST)

ధర్మశాల వన్డే : వెస్టిండీస్ చిత్తు.... టైటిల్ భారత్ వశం.. 5వ వన్డే రద్దు!

ధర్మశాల వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ బోర్డు, విండీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా ఐదో వన్డే మ్యాచ్‌‌తో పాటు.. ఈ పర్యటననే రద్దు చేసుకుంటున్నట్టు బీసీసీఐకు వెస్టిండీస్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో నాలుగు మ్యాచ్‌లతో విండీస్ పర్యటన ముగిసింది. 
 
అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రైనా, రహానే రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. విమర్శకులకు కోహ్లీ సమాధానం చెబుతూ 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 127 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. అతనికి రైనా (71), రహానే (68) అద్భుత సహకారమందించారు. ధావన్ (35) రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్, రస్సెల్, బెన్ తలో వికెట్ తీశారు.
 
అనంతరం 331 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు 48.1 ఓవర్లలో 271 పరుగులకే ఆలౌట్ అయ్యారు. శామ్యూల్స్ (112) సెంచరీ చేయడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఒక దశలో రసెల్స్ (46) మెరుపులు మెరిపించడంతో టీమిండియా ఓడిపోతుందనే భావన కలిగింది. అయితే, రసెల్స్ దూకుడుకు ఉమేష్ యాదవ్ బ్రేకులు వేయడంతో విండీస్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. ఫలితంగా స్యామీ (16), బ్రేవో (40), పొలార్డ్ (6), రామ్‌దిన్ (9), హోల్డర్ (11) చొప్పున పరుగులు చేశారు. దీంతో భారత్ 59 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.