ఫిలిప్ హ్యూస్ మృతి: గతంలో మన క్రికెటర్ కూడా.. బంతి తగిలి..?
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. "క్రికెట్ డేంజరస్ గేమ్" అని విండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రయాన్ లారా చెప్పినట్లు ఫిలిప్ హ్యూస్ లాగానే గతంలో మన క్రికెటర్ కూడా బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
బ్యాట్స్మన్ రిస్క్ అధికమని, ఎంత సేఫ్టీ ఉపకరణాలు ధరించినా ఒక్కోసారి ముప్పు తప్పట్లేదు. ఇలాంటి ఘటనలు క్రికెట్ డైరీలో ఉన్నాయి. అలాంటి ఘటనల వివరాల్లోకెళితే... గతంలో భారత్కు చెందిన రమణ్ లాంబా కూడా బంతి తగిలి మరణించాడు.
1998లో బంగ్లాదేశ్లో క్లబ్ క్రికెట్ ఆడుతూ లాంబా ఓ మ్యాచ్లో షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్కు నిలుచున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న మెహ్రాబ్ హుస్సేన్ బలంగా షాట్ కొట్టాడు. బంతి లాంబాకు గట్టిగా తగిలింది. దీంతో, కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, కోమాలోకెళ్లాడు. మూడురోజులు పాటు మృత్యువుతో పోరాడిన లాంబా చివరికి కన్నుమూశాడు.
క్రికెట్లో ఇలాంటి విషాద ఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. 1959లో అబ్దుల్ అజీజ్ అనే పాకిస్థానీ దేశవాళీ క్రికెటర్ 19 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు విడిచాడు.
1960లో భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ నారీమన్ కాంట్రాక్టర్కు విండీస్ బౌలర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తగిలింది. దీంతో, నారీమన్ ఆరు రోజులు కోమాలో ఉన్నాడు. ప్రాణాలు నిలిచినా, అతని కెరీర్కు అదే చివరి మ్యాచ్ అయింది. 1975లో కివీస్ ఆటగాడు ఈవెన్ చాట్ ఫీల్డ్కు నాలుక తెగింది. ఇంగ్లండ్ పేసర్ లీవర్ వేసిన బంతిని ఆడబోయి గాయపడ్డాడు.