సెంచరీతో సెలక్టర్లకు సమాధానం చెప్పిన రోహిత్ శర్మ!
యువ క్రికెటర్ రోహిత్ శర్మ మళ్లీ భారత వన్డే క్రికెట్ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమైందనే చెప్పొచ్చు. ఫామ్లో ఉన్నప్పటికీ గాయాల బారిన పడటంతో జట్టుకు దూరమైన ఈ యువ క్రికెటర్ గురువారం శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో రెచ్చిపోయాడు. అటు, తన ఫిట్నెస్పై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేశాడు. ఫలితంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ను ఎంపిక చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే రోహిత్ తాజా ప్రదర్శన టీమిండియా వ్యూహకర్తలకు పరీక్ష పెట్టినట్టయింది. ఓపెనింగ్ స్లాట్లో రహానే, ధావన్లు పాతుకుపోయారు. ఇప్పుడు రోహిత్ రాణించిందీ ఓపెనర్ గానే. దీంతో, రోహిత్ను జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడించాలన్నది టీం మేనేజ్మెంట్కు ఓ తలనొప్పిగా మారే అంశమే.
మరోవైపు గురువారం ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా A జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్గా బరిలో దిగిన రోహిత్ 111 బంతుల్లో 142 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. యువసంచలనం మనీశ్ పాండే (135 నాటౌట్) కూడా సెంచరీ చేయడంతో ఇండియా A జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 294 పరుగులే చేశారు. దీంతో, 88 పరుగులతో ఓడిపోయారు.