శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (10:02 IST)

ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు పక్కా వ్యూహాలతో అడుగుపెట్టాం : విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపై చిత్తు చేసేందుకు పక్కా వ్యూహాలతో అడుగుపెట్టినట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆసీస్‌లో టీమిండియా అడుగుపెట్టిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ పర్యటన ప్రారంభమానికి ముందే ఆస్ట్రేలియా, భారత్ మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం ఆరంభమైంది. భారత్‌‍కు ఈ పర్యటన మరో చేదు అనుభవం కానుందని ఆసీస్ మాజీలు అంటుండగా, ఇక్కడ గెలవలేకపోవడానికి ప్రస్తుతం కారణాలేమీ కనిపించడంలేదని టీమిండియా తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 
 
ఇదే అంశంపై ఆయన అడిలైడ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఆసీస్ పర్యటన, పరిస్థితులకు అలవాటు పడడం కంటే ఆలోచనా విధానానికి సంబంధించిన విషయం అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ మెరుగ్గా రాణిస్తున్నాడని, అయితే, అతన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధనసంపత్తి తమ వద్ద ఉందని చెప్పుకొచ్చాడు. 
 
రెగ్యులర్ కెప్టెన్ ధోనీకి గాయం నేపథ్యంలో, కోహ్లీకి తొలి టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 4 నుంచి 8 వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా... ఆసీస్, ఇంగ్లండ్ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతుంది.