దావా హెచ్చరికలతో దిగివచ్చిన విండీస్ : బీసీసీఐతో చర్చలకు సై!
బీసీసీఐ దావా హెచ్చరికలతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మేల్కొంది. తమ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ పెద్దలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. భారత పర్యటనను సగంలోనే ముగించాలని విండీస్ ఆటగాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల బీసీసీఐ వారి క్రికెట్ బోర్డునే తప్పుబడుతోంది.
ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డుపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది కూడా. విండీస్తో అన్ని ద్వైపాక్షిక సిరీస్లను రద్దు చేసుకుంటున్నట్టు మంగళవారం హైదరాబాదులో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ బోర్డు నష్టనివారణ చర్యలకు దిగింది.
బార్బడోస్లో సమావేశమైన విండీస్ క్రికెట్ బోర్డు తాజా పరిణామాల పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేగాకుండా, భారత్ సిరీస్ మధ్యలోనే నిలిచిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.