గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 15 జూన్ 2017 (04:22 IST)

యువరాజ్ బాధపడొద్దు.. కోట్లమందిమి నీతోనే ఉన్నాం.. కలకాలం జీవించు.. అభిమానుల నీరాజనం

తన క్రికెట్ కెరీర్లో ఎలాంటి లోటు మిగిలి లేదని, కేన్సర్ వ్యాధికి గురై కూడా ఇంకా బతికి ఉండటమే నా జీవితంలో అతి గొప్ప విషయమని వినమ్రంగా ప్రకటించిన భారత క్రికెటర్ యువీకి సోషల్ నీరాజనాలు పలుకుతోంది. ఇప్పుడు క్రికెట్ పరంగా ఎంతో మంచి స్థితిలో కొనసాగుతున్నంద

తన క్రికెట్ కెరీర్లో ఎలాంటి లోటు మిగిలి లేదని, కేన్సర్ వ్యాధికి గురై కూడా ఇంకా బతికి ఉండటమే నా జీవితంలో అతి గొప్ప విషయమని  వినమ్రంగా ప్రకటించిన భారత క్రికెటర్ యువీకి సోషల్ నీరాజనాలు పలుకుతోంది. ఇప్పుడు క్రికెట్ పరంగా ఎంతో మంచి స్థితిలో కొనసాగుతున్నందున తన జీవితంలో కోల్పోయిన విషయాల గురించి మాట్లాడదల్చుకోలేదని చెప్పిన యువీ మాటలు మనుషుల్లో స్ఫూర్తిని నింపే మంత్రనాదాలంటూ నెటిజన్లు కొనియాదుతున్నారు. 
 
క్యాన్సర్‌తో పోరాడుతూనే తిరిగి జట్టులోకి వచ్చిన సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అటు టి20లోనూ, వన్డే మ్యాచుల్లోనూ అదరగొడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ యువీకి 300 మ్యాచ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యువరాజ్ తాను భారత్ తరపున ఆటడం వరంగా భావిస్తానని చెప్పాడు. మరిన్ని సంవత్సరాలు భారత్‌ తరపున ఆడాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు.
 
ఎన్నో అవరోధాలు ఎదురైనా 300వ వన్డే ఆడబోతున్నా. ఇందుకు గర్వంగా ఉంది. ఓ దశలో ఇక మళ్లీ ఆడలేనేమో బాధపడ్డాను. ఇప్పుడు ఇక్కడున్నా. మంచి ప్రదర్శనలు చేస్తున్నా. మరికొన్నేళ్లు ఇలాగే ఆడతా. మెరుగ్గా ఆడుతున్నంతకాలం క్రికెట్లో కొనసాగుతాను. నాలో గొప్ప గుణం.. తుదికంటా పోరాడడం. ఎంతటి అడ్డంకి ఎదురైనా సరే.. ముందుకు సాగడం. కుర్రాళ్లకు నా సందేశం కూడా ఇదే. వెనక్కి తగ్గకండి. సాఫీగా సాగుతున్నప్పుడైనా.. అడ్డంకులు ఎదురైనపుడైనా ఒకే తీవ్రతతో సాధన చేయండి’’ అని యువీ పిలుపునిచ్చాడు.
 
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌ యువీ కెరీర్‌లో 300వ వన్డే. ఈ సందర్భంగా వన్డేల్లోలా టెస్టుల్లో ఘనమైన రికార్డు లేనందుకు చింతిస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రాణాలతో ఇంకా బతికి ఉండడమే పెద్ద విషయమని యువరాజ్‌ అన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించి.. యువీ టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. సాధించలేని విషయాల గురించి మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. ఈ ఫామ్‌నే కొనసాగించాలనుకుంటున్నా అన్నాడు యువీ. 
 
మూడేళ్ల నుంచి దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నా. పెళ్లి సమయంలో తప్ప ఎప్పుడూ ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాలేదు. అందుకే మళ్లీ జట్టులోకి రాగలిగాను’’ అని యువరాజ్‌ చెప్పాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడంకంటే దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టమని అన్నాడు. ఎలాంటి కష్టాలు వచ్చినా ముందడుగు వేయడమే తన తత్వమని యువరాజ్ సింగ్ చెప్పాడు.
 
భారత్‌కు ఒక్క మ్యాచ్ ఆడితే చాలు జన్మ ధన్యమైపోతుందని తొలుత తనకు అనిపించేదని, అయితే చూస్తుండగానే 300 మ్యాచ్‌లు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. క్యాన్సర్‌తో పోరాడుతూనే తిరిగి జట్టులోకి వచ్చి అటు టి20లోనూ, వన్డే మ్యాచుల్లోనూ అదరగొడుతున్న యువీ, వెనుకడుగు వేయడం తన డిక్షనరీలోనే లేదన్నాడు. 
 
కేన్సర్ వస్తే అది ఏ స్టేజ్ లో ఉన్నా మరణమే తప్ప మార్గం లేదని గుండెకోతకు గురవుతున్న లక్షలాది మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులకు యువరాజ్ ఒక నిలువెత్తు స్పూర్తి. అందుకే జీవితంలో ఇంకే పెద్ద కోరికలూ లేవని క్రికెట్ ఆడటం తప్ప మరే లక్ష్యమూ పెట్టుకోలేదని యువీ చెప్పడం కోట్లమందిని కదిలిస్తోంది. మాకోసం ఆడుతూనే ఉండు యువీ.. మా మద్దతు ఎప్పుడూ మీకే అంటూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.