శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (19:05 IST)

ఎడ్జిబాస్టన్ సెమీఫైనల్.. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 224.. కంగారూల చేతిలో ఆ రికార్డ్

ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎడ్జిబాస్టన్ వేదిక అయ్యింది. ఇంగ్లండ్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 119 బంతుల్లో 85(6 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌటైంది.


దీంతో ఇంగ్లాండ్‌కు 224 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు, మార్క్ వుడ్‌కు ఒక వికెట్ లభించింది.
 
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్టీవ్‌స్మిత్‌ (85), అలెక్స్‌ కారీ (46), మాక్స్‌వెల్‌ (22), మిచెల్‌ స్టార్క్‌ (29) సమయోచిత పోరాటం చేశారు. ఇకపోతే.. టాస్‌ ఓడినప్పటికీ ఇంగ్లండ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. త్వరగా వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బతీసింది. తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసింది. కంగారూ బౌలింగ్‌ దాడిని ఇంగ్లీష్ జట్టు ఎదుర్కొంటుందా లేదా తెలియాలంటే.. కొన్ని గంటలు వేచి చూడాలి. 
 
ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం (జులై 14)న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న పైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుండగా... ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 
 
ఇకపోతే.. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓటమి ఎరుగని జట్టుగా ఆస్ట్రేలియా వుంది. 1975 నుంచి 2015 వరకు జరిగిన ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

ఇప్పటివరకు ఏడు సార్లు ఆస్ట్రేలియా సెమీపైనల్‌కు చేరగా అన్ని సార్లూ ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఇక, ఏడు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన ఆస్ట్రేలియా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలవగా... రెండు సార్లు ఓడిపోయింది.