శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (13:05 IST)

ఇంగ్లండ్‌కు రెండు దశబ్దాల కల నెరవేరింది!

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు రెండు దశాబ్దాల కల నెరవేరింది. సొంత గడ్డపై ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 119 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అంటే 27 యేళ్ల తర్వాత్ ఇంగ్లండ్ జట్టు ఐసీసీ ప్రపంచ కప్ సెమీస్ పోటీలకు అర్హత సాధించడం గమనార్హం. దీంతో ఆ దేశ క్రికెట్ అభిమానుల్లో సరికొత్త ఆశలురేపింది. 
 
ఇంగ్లండ్ చివరిసారి 1992 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకుంది. ఆ తర్వాత మరెప్పుడూ సెమీస్ ముఖం చూడలేదు. తాజాగా, కివీస్‌పై గెలుపుతో 12 పాయింట్లతో మూడోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సెమీస్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
 
కాగా, బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (60), బెయిర్‌స్టో (106) మంచి శుభారంభం ఇచ్చారు. కానీ, రాయ్‌ను అవుట్‌ చేసిన నీషమ్‌ (2/41).. తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. రూట్‌ (24), బెయిర్‌స్టో 2వ వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం జత చేయడంతో పట్టిష్ట స్థితిలో నిలిచింది. 
 
అయితే, రూట్‌ను బౌల్ట్‌ (2/56) క్యాచ్‌ అవుట్‌ చేయగా.. బెయిర్‌స్టోను హెన్రీ పెవిలియన్‌ చేర్చాడు. బట్లర్‌ (11), స్టోక్స్‌ (11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 248/5తో ఒత్తిడిలో పడింది. మోర్గాన్‌ (42)ను హెన్రీ అవుట్‌ చేశాడు. రషీద్‌ (16), ప్లంకెట్‌ (15 నాటౌట్‌) 305 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 306 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు నికోల్స్‌ (0), గప్టిల్‌ (8) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరడంతో కష్టాల్లో పడింది. అలాగే, ఆదుకుంటారనుకున్న విలియమ్సన్‌ (27), రాస్‌ టేలర్‌ (28) వెంటవెంటనే రనౌట్‌లు కావడంతో కివీస్‌ 69/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
ఈ దశలో లాథమ్‌, నీషమ్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, నీషమ్‌ను అవుట్‌ చేసిన మార్క్‌ ఉడ్‌.. 6వ వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. గ్రాండ్‌హోమ్‌ (3) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. లాథమ్‌ను ప్లంకెట్‌ క్యాచ్‌ అవుట్‌ చేసి కివీస్ పతనాన్ని ఖరారు చేశాడు. చివరకు కివీస్ జట్టు 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఇంగ్లండ్ సెమీస్‌లో అడుగుపెట్టగా, న్యూజిలాండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.