శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (19:10 IST)

రోహిత్ శర్మ శతకం.. కోహ్లీ, పాండ్యా ఒకే ఓవర్లో అవుట్.. బంగ్లా టార్గెట్ 315

బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులు సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడారు. బంగ్లా బౌలర్ల ధాటికి బ్యాటింగ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. 
 
కేఎల్ రాహుల్ 92 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక బౌండరీతో 77 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 121 బంతులాడి, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 104 పరుగులతో అవుట్ అయ్యాడు. ఇక భారత ఆటగాళ్లతో పంత్ (48), ధోనీ (35) మోస్తరుగా రాణించారు. 
 
రిషబ్ పంత్(48) షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. ఇక కోహ్లీ, పాండ్యా నిరాశపరిచారు. ప్రపంచ కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (26: 27 బంతుల్లో 3 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. 
 
ముస్తాఫిజుర్ వేసిన 39వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్కేర్‌లెగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(0) కూడా ఎదుర్కొన్న రెండో బంతికే స్లిప్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది.
 
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
 
దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇది వరల్డ్‌కప్‌లో భారత్‌కు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. అంతకముందు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు 174 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించారు. 2015 వరల్డ్‌కప్‌లో ధావన్‌తో కలిసి రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్‌-రాహుల్‌లు బద్దలు కొట్టారు.
 
రోహిత్ శర్మ, రాహుల్‌ల భాగస్వామ్యంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకోగలిగింది. దీంతో బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే 315 పరుగులు సాధించాల్సి వుంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లు సాధించారు. షకీబ్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలా ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.