మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (11:48 IST)

#2GScamVerdict టైమ్‌లైన్... రాజా - కనిమొళి నిర్దోషులు

గత యూపీఏ - 2 ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్కామ్‌లో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈకేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజాతో పాటు, డీఎంకీ ఎంపీ కనిమొళితో సహా

గత యూపీఏ - 2 ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్కామ్‌లో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈకేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజాతో పాటు, డీఎంకీ ఎంపీ కనిమొళితో సహా మొత్తం 14 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలు చూపించలేకపోయిదంటూ స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేశారు. దీంతో ఇటు కనిమొళి, రాజాలకు భారీ ఊరట కలగడంతో పాటు డీఎంకే పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ కేసు పుట్టుపూర్వోత్తరాలను ఓసారి పరిశీలిస్తే, యూపీఏ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా టెలికంశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన 2జీ స్పెక్ట్రం కేటాయించడంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక దాఖలు చేసింది. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. దీంతో ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. 
 
అదేసమయంలో సీబీఐ రెండు కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ ఒక కేసు నమోదు చేశాయి. స్వాన్‌ టెలికాం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయించినందుకు ప్రతిఫలంగా డీఎంకేకు సొంతమైన కలైంజర్‌ టీవీకి రూ.200 కోట్లు లంచం ముట్టజెప్పారని వచ్చిన ఆరోపణలను ఈ కేసులతో జత చేయగా, ఢిల్లీ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ఈ కేసులపై విచారణ జరిపారు. సీబీఐ దాఖలు చేసిన రెండు కేసులలో మొదటి కేసులో ఎ.రాజా, కనిమొళి, టెలికంశాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్ద్‌ బెహ్రా, ఎ.రాజా మాజీ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిని నిందితులుగా ఉన్నారు. 
 
2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయించడంలో ప్రభుత్వానికి రూ.30,984 కోట్ల ఆదాయానికి గండి పడిందని ఛార్జ్‌షీటులో నమోదు చేశారు. ఆరేళ్లకుపైగా సాగిన విచారణ గత అక్టోబరు 25న ముగిసింది. దీంతో డిసెంబర్‌ 21న తీర్పు వెలువరించనున్నట్టు ఢిల్లీ సీబీఐ కోర్టు డిసెంబర్‌ మొదటి వారంలో ప్రకటించింది. గురువారం తీర్పు సందర్భంగా కనిమొళి, రాజా సహా నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. తుది తీర్పులో వీరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించడంతో కనిమొళి, రాజా సంతోషం వ్యక్తం చేశారు. డీఏంకే సంబరాలు జరుపుకొంటోంది.
 
* 2007 మే నెలలో కేంద్ర టెలికాం మంత్రిగా ఏ రాజా నియామకం. 
* 2007 ఆగస్టు నెలలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు.
* 2008 కొన్ని టెలికాం కంపెనీలకు 2జీ స్పెక్ట్రమ్‌ను కేటాయింపుల్లో అవకతవకలు
* 2009 మే 4వ తేదీన 2జీ కేటాయింపుల్లో స్కామ్ జరిగినట్టు సెంట్రల్ విజలెన్స్ కమిషన్‌ (సీవీసీ)కి ఎన్జీవో సంస్థ వాచ్‌డాగ్ ఫిర్యాదు.
* 2009లో విచారణకు ఆదేశించిన సీవీసీ.
* 2009 జూలై ఒకటో తేదీన కటాఫ్ తేదీలను మార్చడం చట్ట వ్యతిరేకమని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు.
* 2010 సెప్టెంబర్ 27వ తేదీన దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశం.
* 2010 నవంబర్ పదో తేదీన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌పై కాగ్ నివేదిక. రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్టు నివేదిక.
*2010 నవంబర్ 14-15 తేదీల్లో టెలికాం మంత్రిత్వ శాఖకు మంత్రి ఏ రాజా రాజీనామా. 
* 2011 ఫిబ్రవరి 17-18 తేదీల్లో రాజా అరెస్టు.. తీహార్ జైలుకు తరలింపు.
* 2011 ఏప్రిల్ 2వ తేదీన సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు. కపిల్ సిబాల్‌కు అదనంగా టెలికాం శాఖ బాధ్యతలు అప్పగింత. 
* 2011 నవంబర్ 11వ తేదీన 2జీ స్కామ్ విచారణ ప్రారంభం.
* 2012 ఫిబ్రవరి 2న మంత్రి రాజా హయాంలో పొందిన 122 లైసెన్సులు రద్దు చేసిన సుప్రీంకోర్టు. 
* 2014 ఏప్రిల్ 25న రాజా, కనిమొళిపై ఈడీ చార్జిషీటు.
* 2015 ఆగస్టు 19న రాజాపై అక్రమాస్తుల కేసును నమోదు చేసిన సీబీఐ.
* 2017 సెప్టెంబరు 20న సీబీఐ ప్రత్యేక కోర్టు కేసును అక్టోబరు 25కు వాయిదా.
* 2017 అక్టోబరు 25న విచారణ పూర్తి.
* 2017 డిసెంబర్ 21వ తేదీన తుది తీర్పు వెల్లడి.