గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:11 IST)

తమిళనాట అధికార మార్పిడి.. ఓపీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి.. పళనికి కేంద్ర పదవి? బీజేపీ పక్కా ప్లాన్

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం ఆ పార్టీలో ముసలం ఏర్పడింది. అమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. కానీ ఓపీఎస్ తిరగబడ్డాక.. చిన్నమ్మ జైలుకెళ్లడం, దినకరన్ కూడా రేపో మాపో

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం ఆ పార్టీలో ముసలం ఏర్పడింది. అమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. కానీ ఓపీఎస్ తిరగబడ్డాక.. చిన్నమ్మ జైలుకెళ్లడం, దినకరన్ కూడా రేపో మాపో చిప్పకూడు తినడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మన్నార్గుడి ఫ్యామిలీ బయటికి నెట్టడమే తాను చేసే ధర్మయుద్ధంలో తొలి విజయమని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వెల్లడించారు.
 
ఇంకా పళని వర్గంతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ మేలు కోసం అందరూ కలుపుగోలుగా వెళ్లాలని చర్చిస్తున్నారు. అంతేగాకుండా పళనిసామిని కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేసి.. తాను సీఎం పగ్గాలు చేపట్టాలనుకుంటున్నారు. అప్పుడే పార్టీని కాపాడుకోగలమని.. శశికళ వర్గం పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడమే ఈ పరిణామాలకు దారితీసిందనే విషయాన్ని ఓపీఎస్ పళని వర్గానికి నచ్చజెప్తున్నారు. 
 
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ ఒకేతాటిపైకి వచ్చి.. పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఇందుకు పళని వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. పన్నీరును సీఎం చేయాలనే అంశానికి ససేమిరా అంటున్నారు. అయితే సీఎం పళని సామి పేరిట రూ.13 కోట్లు ఆర్కే నగర్ ఎన్నికల్లో పంచినట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో పళనికి కష్టాలు తప్పవని.. దినకరన్ పళనిసామి కూడా కేసులో ఇరికిస్తారని ఓపీఎస్ గ్యాంగ్ చెప్తోంది. 
 
అందుకే పళనికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి, ఓపీఎస్ సీఎం అయితే ప్రజాభీష్టం మేరకు పాలన జరుగుతుందని.. అమ్మ లేకపోయినా తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశాలను సొంతం చేసుకున్నట్లవుతుందని సమాచారం. ఈ విధంగా ఇరు వర్గాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ చర్చలను కొలిక్కి తెచ్చే దిశగా బీజేపీ పావులు కదుపుతోందని సమాచారం. 
 
ఓపీఎస్‌కు బీజేపీ ఫుల్ సపోర్ట్ చేస్తుందని.. ప్రజల ఇష్టానుసారమే ఆయన్ని సీఎం చేసి అవినీతి ఆరోపణలు, కేసులు, మాఫియాతో అన్నాడీఎంకే పార్టీని కైవసం చేసుకోవాలనుకున్న శశి ఫ్యామిలీకి మంచి బుద్ధి చెప్పాలని బీజేపీ భావిస్తోంది. అందుకే చిన్నమ్మను జైలుకు పంపి, ఆపై దినకరన్‌ను కూడా ఆమెతోనే పంపి.. ఓపీఎస్‌ను సీఎంను చేసి.. పళనికి ప్రమోషన్ ఇచ్చేలా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 
 
ఇందులో భాగంగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాల అంశంపై గురువారం నాడు మంత్రి జయకుమార్, మరో సీనియర్ నేత తంబీదురై గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. దీంతో తమిళ రాజకీయాల్లో.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఏం జరుగుతుందోననే చర్చ సాగుతోంది. ఇప్పటికే చెన్నైలో, తమిళనాట అధికార మార్పిడి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పళనిస్వామి - పన్నీరుసెల్వం వర్గాల మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయి. 
 
ఇలాంటి సమయంలో రాజ్ భవన్‌లో నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార మార్పిడి కోసం ఏమైనా చర్చ జరుగుతోందా అనే కోణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పోస్ట్ పైన ప్రధానంగా పన్నీరుసెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మధ్య చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో తంబిదురై, మంత్రి జయకుమార్ గవర్నర్‌ను కలవడంపై చర్చ జరిగింది. అయితే వీరిద్దరూ పళనినే సీఎం చేయాలనుకుంటున్నారు. 
 
గవర్నర్ విద్యాసాగర రావుతో భేటీ అనంతరం తంబీదురై మాట్లాడారు. గవర్నర్‌తో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తేల్చి చెప్పారు. కాగా, గతంలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో గవర్నర్ పైన విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి గవర్నర్‌ ప్రజల మద్దతున్న ఓపీఎస్‌ను సీఎం చేయాలనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.