మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (15:27 IST)

నా తల్లి కూడా మీ అంత అందమయినది అయి ఉంటే నేను కూడా..."ఛత్రపతి" శివాజీ వ్యక్తిత్వం

నేడు ఛత్రపతి శివాజీ పుట్టినరోజు. ఆయన క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలోని శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. శివాజీ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. తమ బిడ్డకు వా

నేడు ఛత్రపతి శివాజీ పుట్టినరోజు. ఆయన క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలోని శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. శివాజీ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. తమ బిడ్డకు వారు తమ ఆరాధ్య దైవమైన శివై అంటే పార్వతి అనే పేరు కలిసి వచ్చేట్లుగా శివాజీ అని పెట్టారు. యుక్త వయసు నుంచే యుద్ధ తంత్రాలలో ఆరితేరిన శివాజీ ఎన్నో యుద్ధాలు చేసి ఛత్రపతి బిరుదును పొందారు. ఐతే శివాజీ లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేసేవాడు కాదు. అంతేకాదు యుద్ధంలో ఓడిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలతో సహా పసివారికి సాయం చేసేవాడు. 
 
ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే... ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో... శివాజీ ఆమెతో ఇలా అన్నాడు. "నా తల్లి కూడా మీ అంత అందమైనదైవుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. అందుకే శివాజీ అంటే కులమతాలతో తేడా లేకుండా ఎంతగానో అభిమానించేవారు. భారతదేశంలో ఎందరో రాజులు పాలించినప్పటికీ శివాజీకి వున్న గొప్పతనం విభిన్నమైనది.
 
శివాజీ తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువై వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునికి పూజలు చేశారట. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకుని పూజలు చేసిన ఛత్రపతి శివాజీ తదనంతరం పలు యుద్ధాల్లో విజయం సాధించాడట. 
 
ఒకప్పుడు సముద్ర తీరాన ఈ ఆలయం వుండేదనీ, ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని ఇక్కడకు మార్చారని చెపుతారు. ఆలయంలో మహావిష్ణు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతోపాటు అగస్త్యుడు, అంగీరసుడు తదితర మునీశ్వరులున్నారు. ఈ ఆలయంలో దర్శన వేళలు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ. అమ్మను దర్శించుకున్న వారికి కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అలా ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించడం శివాజీ చేసేవారని చరిత్ర చెపుతోంది.