గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (20:04 IST)

ఏపీలో ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు లేన‌ట్టే... వాళ్లిక తూర్పు తిరిగి...?

విజ‌య‌వాడ ‌: తెలుగుదేశం అధినేత‌... ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు రాజ‌కీయంలో అప‌ర చాణ‌క్యుడ‌నే పేరుంది. ఏదైనా చేయాలనుకున్నా, ఎవరికైనా హ్యాండ్ ఇవ్వాలనుకున్నా.... అందుకు కొద్దికాలం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. ముఖ్యంగా మీడియా లీకులు హఠాత్తుగా మొదలవ

విజ‌య‌వాడ ‌: తెలుగుదేశం అధినేత‌... ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు రాజ‌కీయంలో అప‌ర చాణ‌క్యుడ‌నే పేరుంది. ఏదైనా చేయాలనుకున్నా, ఎవరికైనా హ్యాండ్ ఇవ్వాలనుకున్నా.... అందుకు కొద్దికాలం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. ముఖ్యంగా మీడియా లీకులు హఠాత్తుగా మొదలవుతాయి. జనమంతా ఈ లీకుల్లోనూ లాజిక్ ఉంది కదా అని నమ్మిన తర్వాత ”ఆపరేషన్ మొండి చేయి” ముసుగు తీసుకుని బయటకు వస్తుంది. ఇప్పుడు మంత్రి పదవులకు ఆశపడి, చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా వదిలించుకునేందుకు లీకుల పర్వం మొదలైంది. తాజాగా లీకైన లీకు వార్తలను చూస్తే జనం కూడా చంద్రబాబు చెబుతున్న దానిలోనూ అర్థముంది కదా అన్న భావనకు రావడం ఖాయం.
 
ఫిరాయింపు ఎమ్మెల్యేల మంత్రి పదవులకు సంబంధించి బయటకొచ్చిన లీక్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కూడా వాడుకున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే గవర్నర్‌ నరసింహన్‌ను చంద్రబాబు కలిశారు. ఆ సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారని అన్ని ఛానళ్లు పెద్ద పెద్ద బ్రేకింగ్‌లు నడిపాయి. అయితే లేటెస్ట్‌గా టీడీపీ నేతలు వదలుతున్న లీకేంటంటే… ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను ఉన్నట్టు గవర్నర్‌కు చంద్రబాబు చెప్పారట. ఆ మాట చెప్పగానే గవర్నర్‌ కాస్త సీరియస్‌గా స్పందించారట. 
 
తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కేసీఆర్‌ మంత్రి వర్గంలోకి తీసుకుంటే ప్రమాణస్వీకారం చేయించిన తనపై మీరు, మీ పార్టీ నేతలు చాలా విమర్శలు చేశారు కదా… మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎలా ఇస్తారని గవర్నర్‌ ప్రశ్నించారట. తలసాని విషయంలో నాకు నీతులు చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అదే పని చేయిస్తారా? అని చంద్రబాబును గవర్నర్‌ నిలదీశారట. దీంతో చంద్రబాబు మాట నోట రాలేదని తమ్ముళ్లే చెబుతున్నారు.
 
కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే పార్టీ సీనియర్లు మాత్రం ఈ లీక్‌పై మరోలా స్పందిస్తున్నారు. చంద్రబాబును గవర్నర్‌ నిలదీసి ఉండవచ్చు… ఎందుకంటే తలసాని విషయంలో గవర్నర్‌ను బాగా ఇబ్బంది పెట్టాం. కానీ చంద్రబాబు, గవర్నర్ మాత్రమే ఉన్న చోట జరిగిన సంభాషణ తమ పార్టీ నేతలకు ఎలా తెలిసిందని ధర్మసందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పక్కాగా తన అధినేత వదిలిన లీకే అయి ఉంటుందని అనుభవంతో చెబుతున్నారు. బహుశా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎగ్గొట్టేందుకు ఈ ప్రచారం గాల్లోకి వదిలి ఉంటారని అంచనా వేస్తున్నారు. 
 
ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై గవర్నర్‌ కూడా ప్రతికూలంగా స్పందించారని… తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని కాబట్టి ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడమే పార్టీ ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యానికి మంచిదన్న భావనతో చంద్రబాబు ఉన్నారన్న మరో లీక్ ప్రచారం కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఒక్కో లీక్‌తో స్టెప్‌ బై స్టెప్‌, ఇంచ్ బై ఇంచ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మానసికంగా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని టీడీపీ నేతలే అధినేత వ్యూహాలకు ముందస్తు రివ్యూ చేస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం త‌ప్ప చేయ‌గ‌లిగింది శూన్యం.