శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2015 (17:04 IST)

రాజకీయాలు మారుతున్నాయా....? కేసీఆర్ - బాబు, రాహుల్ గాంధీ - జగన్...

రాజకీయాలు ఎలాగైనా ఎప్పుడైనా మారిపోతుంటాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే కొన్ని ఫార్ములాలు తల్లకిందులుగా మారిపోయి వేరే లెక్కలు తెరపైకి వస్తున్నాయని చెప్పుకుంటున్నారు రాజకీయాలపై చర్చించే విశ్లేషకులు. మొన్నటివరకూ ఎడమొగం పెడమొగంగా ఉన్న కేసీఆర్-చంద్రబాబు నాయుడులిద్దరూ కలిసిపోయారనే చర్చ ఇప్పుడు హాట్ ఆఫ్ ది టు స్టేట్స్‌గా మారింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అపాయింట్మెంట్ కోరి మరీ వెళ్లి ఆహ్వానించడమే కాకుండా, ఏపీలో అమరావతి శంకుస్థాపనకు ఆయనను ప్రత్యేకంగా హెలికాప్టర్ లో తీసుకురావాలని నిర్ణయించింది. 
 
ఇదేకాకుండా వీరిరువురూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. అదేమంటే ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగిపోయేందుకు పరస్పరం సహకరించుకుందామని అనుకున్నట్లు చెప్పుకుంటున్నారు. పైగా... అన్నా మీరే స్వయంగా వచ్చారు... నేను రాకుండా ఎలా ఉంటాను అని కేసీఆర్ అంటే, అంకుల్ మేము తప్పకుండా వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారట. పిలుపులు, పలుకరింపులు చాలా బాగున్నాయి. ఇదే వాతావరణం సాగాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా అంటున్నారు. 
 
వ్యవహారం చూస్తుంటే తెరాస త్వరలో కేంద్రమంత్రివర్గంలో చేరిపోయేట్లు కూడా ఉందంటున్నారు. ఇందుకు అటు వెంకయ్యనాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ సహకారం అందిస్తారని చెప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో తెరాసకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తామే ఇచ్చామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ చెప్పడమే కాకుండా ఈసారి తమకే ఓటు వేయాలని కూడా ప్రచారం చేసేస్తున్నారు. ఇంకా కేసీఆర్ సర్కారును తూర్పారపడుతున్నారు. 
 
ఇక ఏపీలో పరిస్థితి భిన్నం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దీనితో వైకాపాతో చేరి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తున్నట్లు సమాచారం. ఇలా మొత్తమ్మీద అమరావతి రాజధాని శంకుస్థాపన నేపథ్యంలో ఫార్ములాలు మారిపోతున్నాయని చెప్పుకుంటున్నారు. చూద్దాం... ఏ లెక్క ఎలా తిరిగి వస్తుందో...?!!