గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:52 IST)

ఆన్‌లైన్ మార్కెట్‌లో ఏపీ కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చీరలు... ఇంకా....(Photos)

ఒక ప్రారంభం ఎన్నో సవాళ్లను, పరిష్కారాలను అన్వేషిస్తుంది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ విపణిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హస్తకళలు, చేనేత కళాకారులు రూపొందించిన వస్తువులను విక్రయించాలన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సెర్ప్ ప్రారంభించిన డిజిటల్

ఒక ప్రారంభం ఎన్నో సవాళ్లను, పరిష్కారాలను అన్వేషిస్తుంది. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఇ-కామర్స్ విపణిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హస్తకళలు, చేనేత కళాకారులు రూపొందించిన వస్తువులను విక్రయించాలన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సెర్ప్ ప్రారంభించిన డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది మే నెలలో అర్బన్ విలేజ్ బ్రాండ్ నేమ్‌తో ప్రారంభించిన డిజిటల్ మార్కెటింగ్ కళాకారులకు కొత్త మార్కెట్ అందిస్తోంది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత చీరలు, కలంకారి చీరలు, ఉప్పాడ చీరలు, బొబ్బిలి వీణలు, ఏటికొప్పాక ఆటవస్తువులు మొదలగు ప్రాంతీయ ఉత్పత్తులను దేశీయంగా ప్రోత్సాహం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ చేతివృత్తి కళాకారులకు సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది. 
 
ఇ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆయా వస్తువులను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యాచరణ చేతివృత్తి కళాకారులకు సరికొత్త మార్కెట్ టెక్నిక్స్ నేర్పుతోంది. డిజిటల్ మార్కెట్లోకి ఉత్పత్తులు ప్రవేశిస్తే తమకు మంచి రెస్పాన్స్ ఉంటుందన్న నమ్మకంలో చేతివృత్తి కళాకారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పెద్దయెత్తున ప్రమోట్ చేయాలని సెర్ప్ నిర్ణయించింది.
 
ఇందుకోసం ఇ-కామర్స్ దిగ్గజాలతో చర్చలు జరపాలని... పండుగల సమయంలో మన చేతివృత్తి కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రముఖంగా ఇ-కామర్స్ సైట్లలో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంలో ఏపీ సెర్ప్ ఉంది. పెద్దయెత్తున అర్బన్ విలేజ్ బ్రాండ్ నేమ్‌ను ప్రమోట్ చేస్తే మార్కెటింగ్ పెరుగుతుందని... ఆ ఫలాలు కళాకారులకు దన్నుగా నిలుస్తానియని సెర్ప్ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు 25 మంది చేతివృత్తి కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచారు. ఇందుకోసం కృష్ణా మరియు విశాఖపట్నం జిల్లా సమాఖ్యలను ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, గోకూప్ మరియు క్రాఫ్ట్స్ విల్లాలలో అమ్మకందారులుగా రిజిస్టర్ చేసి విశాఖపట్టణం, విజయవాడల్లో గోడౌన్లను ఏర్పాటు చేశారు. 
 
అర్బన్ విలేజ్ బ్రాండ్ నేమ్‌తో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్‌తో 570 ఉత్పత్తులు అమ్మకాలను సంస్థల సహకారంతో విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 4 లక్షల రూపాయల ఖరీదు చేసే 300 రకాల ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మడం జరిగింది. వచ్చే రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ కోసం వేలాది ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలన్న యోచనలో సెర్ప్ ఉంది. ఇందుకోసం డిజిటల్ మార్కెటింగ్ లోకి ప్రవేశించే  చేతివృత్తి కళాకారులకు కావాల్సిన ఏర్పాట్లను సెర్ప్ ఇప్పటికే చేపట్టింది.
 
ఎలాంటి లాభపేక్షతో సంబంధం లేకుండా చేతివృత్తి కళాకారులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సెర్ప్ అధికారులు వివరించారు. డిజిటల్ అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... ఈ బ్రాండ్ ద్వారా అమ్మే ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే మన చేతివృత్తి కళాకారులకు మంచి బిజినెస్ లభించే అవకాశముందని సెర్ప్ భావిస్తోంది.
 
కొనుగోలుదారులకు కావలసిన వివిధ రకాల వస్తువులను వారి ఇంటి నుంచే ఆన్‌లైన్లో కొనుగోలు చేసుకునే వెసులుబాటే “డిజిటల్ మార్కెటింగ్”. ఇలాంటి కాన్సెప్ట్‌ను మన చేతివృత్తి కళాకారులకు అందివ్వడం ద్వారా వారు వ్యక్తిగతంగా వృద్ధి చెందడంతో పాటు సరికొత్త మెలకువలను తెలుసుకునే వీలు కలుగుతుంది. ఉత్పత్తులకు సంబంధించి ఆన్‌లైన్లో వచ్చే రివ్యూల ఆధారంగా వారి ఉత్పత్తులకు నాణ్యత పెంచుకునే అవకాశం కూడా కలుగుతుంది. పోర్టల్స్‌లో అమ్మకానికి పెట్టిన SHG కుటుంబాలు తయారుచేసిన చేనేత మరియు హస్తకళా వస్తువుల అమ్మకాల ద్వారా వారికి రావలసిన సొమ్మును ప్రతి 15 రోజులకు ఒకసారి వారివారి బ్యాంకు ఖాతాలకు జిల్లా సమాఖ్యలు జమ చేస్తున్నారు. త్వరలో సొంత వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకొనడానికి డిజిటల్ మార్కెటింగ్ టీం సన్నాహాలు చేస్తోంది. వెబ్‌సైట్‌ల ద్వారా పెద్ద పరిమాణంలో (Bulk Orders) వచ్చే ఆర్డర్స్‌ను కూడా సంపాదించేలా పలు కంపెనీలతో సెర్ఫ్ అధికారులు చర్చలు జరుపుతున్నారు.