శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (14:28 IST)

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు మంత్రి పరిటాల సునీత అండ.. ఎందుకు?

తెలుగుదేశం పార్టీలో పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్న పరిటాల సునీత వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అండగా ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు కదూ. ముందు నుంచి తెలుగుదేశం పార్టీలోనే తమ కుటుంబం ఉందన్న విషయం అందరికీ తెల

తెలుగుదేశం పార్టీలో పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్న పరిటాల సునీత వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అండగా ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు కదూ. ముందు నుంచి తెలుగుదేశం పార్టీలోనే తమ కుటుంబం ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఆ పార్టీ నేతలకు కాకుండా వేరొక పార్టీ నేతలకు అందులోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి సునీత అండగా ఉండడం ఏమిటనుకుంటున్నారా!
 
అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మంత్రిపరిటాల సునీతకు వ్యతిరేకంగా టీడీపీలో ఒక వర్గం పావులు కదుపుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పరిటాల సునీతను బలహీనపరిచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్న చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ధర్మవరంలో వర్గపోరును ఆసరాగా చేసుకుని సునీతకు చెక్‌ పెట్టేందుకు వైరివర్గం ప్రయత్నిస్తోంది.
 
పరిటాల సునీతకు వ్యతిరేకంగా పయ్యావుల కేశవ్, జేసీ, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి కలిసి పనిచేస్తున్నారన్న అనుమానాన్ని పరిటాల వర్గం వ్యక్తం చేస్తోంది. ధర్మవరంలో కేబుల్ కాంట్రాక్ట్‌ విషయంలో పరిటాల వర్గీయులకు, వరదాపురం సూరి వర్గీయులకు మధ్య ఘర్షణ జరగ్గా దాన్ని పెద్దెత్తున ప్రచారం చేయడం వెనుక పరిటాల సునీతకు చెడ్డ పేరు తీసుకొచ్చే కుట్ర ఉందని ఆమె వర్గం భావిస్తోంది.
 
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ వరదాపురం సూరి ఏకంగా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. సూరి వెనుక జేసీ, పయ్యావుల ప్రోద్భలం ఉందని భావిస్తున్నారు. వారే పరిటాల సునీతకు వ్యతిరేకంగా ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పెద్దదిగా చేసి చూపెడుతున్నారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గానికి చెందిన పరిటాల సునీత, రెడ్డి సామాజికవర్గానికి పల్లె రఘునాథ రెడ్డిలు అనంతపురం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు. 
 
అయితే కమ్మ సామాజికవర్గానికే చెందిన పయ్యావుల కేశవ్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఒకే సామాజికవర్గం వారికి ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు రావడం కష్టం. కాబట్టి పరిటాల సునీతను మంత్రివర్గం నుంచి తప్పించేలా పరిస్థితులను సృష్టించేందుకు పయ్యావుల కేశవ్, జేసీ, వరదాపురం సూరి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జిల్లాలో సాగుతోంది. చాలా నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం పరిటాల సునీత ప్రయత్నిస్తున్నారని… దీని పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్నాయన్న భావన చంద్రబాబుకు కలిగేలా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
 
పైగా మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్యే సూరి మరో ఆరోపణ కూడా చేస్తున్నారు. మంత్రి సునీత పలువురు వైసీపీ నేతలకు అండగా ఉంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పెద్దారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిలకు పరిటాల వర్గం సహకరిస్తోందన్నది సూరి, జేసీ వర్గం అనుమానం. నిజానికి పెద్దారెడ్డి కుటుంబంతో పరిటాల కుటుంబానికి దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది.
 
పెద్దారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే సూర్య ప్రతాప్‌ రెడ్డి, పరిటాల రవితో కలిసి పనిచేసిన వారే. ఆ పరిచయం ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య ఉందని చెబుతుంటారు. ఇలా తాడిప్రతి, ధర్మవరం నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులకు పరిటాల సునీత సహకరిస్తున్నారన్నది టీడీపీలోని ఒకవర్గం ఆరోపణ. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పదేపదే చంద్రబాబును కోరుతుండడం వెనుక కూడా పరిటాల సునీతకు చెక్‌ పెట్టే ఉద్దేశమే ఉందంటున్నారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవి ఇస్తే… అదే సామాజికవర్గానికి చెందిన పరిటాల సునీతను కేబినెట్‌ నుంచి పక్కనపెడుతారన్నది ఆమె వైరి వర్గం ఆలోచనగా చెబుతున్నారు.