శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: సోమవారం, 24 అక్టోబరు 2016 (17:24 IST)

బిచ్చం ఎత్తుకుంటూ... కేంబ్రిడ్జి స్థాయికి చేరిన చెన్నై జయవేల్ గాధ ఇదీ...

చెన్న‌ై‌: చ‌దువుకోవాల‌ని జిజ్ఞాస ఉండాలి కానీ, ఏదీ దానికి అడ్డు కాదు అని నిరూపించాడు చెన్న‌ైకి చెందిన జ‌య‌వేల్. ఆ యువ కెర‌టం సాధించిన విజ‌యం మామూలుది కాదు. రోడ్డుపై బిచ్చం ఎత్తుకుంటూ, కాలం వెళ్ళ‌దీసే ఓ యాచ‌కురాలి కుమారుడు ఈ జ‌య‌వేల్. బిచ్చంతో క‌డుపే న

చెన్న‌ై‌: చ‌దువుకోవాల‌ని జిజ్ఞాస ఉండాలి కానీ, ఏదీ దానికి అడ్డు కాదు అని నిరూపించాడు చెన్న‌ైకి చెందిన జ‌య‌వేల్. ఆ యువ కెర‌టం సాధించిన విజ‌యం మామూలుది కాదు. రోడ్డుపై బిచ్చం ఎత్తుకుంటూ, కాలం వెళ్ళ‌దీసే ఓ యాచ‌కురాలి కుమారుడు ఈ జ‌య‌వేల్. బిచ్చంతో క‌డుపే నింపుకోవ‌డం క‌ష్టం. కానీ, ఆ కుర్రోడికి చ‌దువుపై మ‌క్కువ ఎక్కువ‌. అందుకే ఎన్నో క‌ష్టాల‌ను ఓర్చుకుని ఆ యాచకురాలి కొడుకు అడ్వాన్సుడ్ మొబైల్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాడు. అది కూడా ప్రఖ్యాత లండన్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో. అత్యంత ద‌య‌నీయ స్థితిలో ఉన్న కుటుంబంలో పుట్టిన జ‌య‌వేల్ ఇపుడు 23 ఏళ్ల కుర్రాడు. అత‌ను అంతటి ఘనవిజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు... అత‌ని కుటుంబ నేప‌థ్యం ఏమిటి?
 
అది 1980. వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేదు. జయవేల్ కుటుంబం పొట్ట చేతపట్టుకుని నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చింది. రానైతే వచ్చారు. కానీ చేసేందుకు ఏ పనీ దొరకలేదు. ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది. అలా ఆత్మాభిమానం చంపుకుని బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు.
 
సొంత ఊరు కాదు. సొంత ఇల్లు లేదు. అయినవాళ్లు లేరు. విధి వక్రిస్తే వచ్చి వీధిన పడ్డారు. ఫుట్‌పాతే ఇల్లూ వాకిలీ. రోడ్డుపక్కనే జీవితాలు. రాత్రిళ్లు మూసి వున్న షాపుల ముందు కాళ్లు డొక్కలో ముడుచుకుని పడుకునేవాళ్లు. ప్రతీసారీ పోలీసులు వచ్చి తరిమేవాళ్లు. ఒక్కోసారి విధి మనిషిని ఎంత చిత్రవధ చేస్తుందో జయవేల్ కుటుంబమే ఉదాహరణ. జయవేల్ తండ్రి గుండె నొప్పితో క‌న్నుమూశాడు. అమ్మ జబ్బు ముదిరి పూర్తిగా నేలవాలి పోయింది. ఏం చేయాలో తెలియని అయోమయం. అప్పుడు జయవేల్‌కు ఆరేళ్ల వయసు.. ఫుట్‌పాత్ మీద అచేతనంగా పడిపోయిన అమ్మ పక్కన గుక్క పట్టి ఏడుస్తున్నాడు.
 
ఈ దృశ్యం ఉమా మధురమన్ అనే దంపతుల కంటపడింది. కుర్రాడి దీనావస్థ ఆ భార్యాభర్తలను కలచివేసింది. ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కుర్రాడి దైన్యంపై ఒక వీడియో స్టోరీ తీశారు. దానికి పేవ్‌మెంట్ ఫ్లవర్ అని పేరుపెట్టారు. చూసిన ప్రతీ ఒక్కరి హృద‌యం ద్రవించిపోయింది. ఇంకా కలిసొచ్చిన అంశం ఏంటంటే ఉమా మధురమన్ సూయం అనే ఎన్జీవో నడుపుతున్నారు. ఆ ట్రస్ట్ సాయంతో జయవేల్ బడిబాట పట్టాడు. అమ్మ కోసం పగలంతా భిక్షాటన. రాత్రంతా చదువు. ఒకవైపు అమ్మ ఆలనా పాలనా. 
 
మరోవైపు పరీక్షలకు ప్రిపేరేషన్. ఆకలి, కసి, ఆరాటం, తపన, మొక్కవోని దీక్ష.. రోజులు దొర్లాయి. ఇంటర్మీడియెట్ దాకా వచ్చాడు. ఇక ప్రయాణం ఆపొద్దని నిర్ణయించుకున్నాడు. విజయమో వీరస్వర్గమో తేలిపోవాలనుకున్నాడు. ఆకలిని అణచిపట్టి పుస్తకాలను ఒకపట్టు పట్టాడు. లక్ష్మీ కటాక్షం లేకుంటేనేం.. సరస్వతి అతడిని ఒడిలోకి తీసుకుంది. ప్లస్ టూలో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. విషయం తెలుసుకున్న కొందరు మనసున్న మరాజులు సాయం చేశారు. వాళ్ల చల్లని దీవెనలతో కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. వెంటనే వేల్స్‌లోని గ్లెండ్యూర్ యూనివర్శిటీ ఆటోమోటివ్ ఇంజినీరింగ్‌లో సీట్ ఆఫర్ చేసింది.
 
చెత్తకుండీ పక్కన పడివున్న అమ్మకు సీటు గురించీ ర్యాంకు గురించీ చెప్పాడు. కానీ ఆ పిచ్చితల్లికి అర్థం కాలేదు. కానీ ఆమె గుండెతడి కన్నీళ్ల రూపంలో వచ్చి ఆశీర్వదించింది. ప్రస్తుతం జయవేల్ ముందు చాలా లక్ష్యాలున్నాయి. చదువు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఒక ఎన్జీవో రన్ చేయాలి. తనలాంటి అభాగ్యులను, అనాధలను అక్కున చేర్చుకుని, వారికి చదువు చెప్పించాలి. వీధిబాలల జీవితాల్లో మార్పులు తేవాలి. తన జన్మ సార్ధకం చేసుకోవాలి. అన్నింటికీ ఆ భ‌గ‌వంతుడు ఉన్నాడంటాడు జ‌య‌వేల్... విష్ యు బెస్టాఫ్ ల‌క్ జ‌య‌వేల్.