గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (15:53 IST)

ఎన్టీయార్ కు భారతరత్నఅడిగితే.. కేంద్రం కాదంటుందా..! బాబు ఎందుకు అడగరు?

ప్రతి మహానాడులోనూ ఇదో తతంగం అయిపోయింది. ప్రతిపాదించడం.. తీర్మానించడం... ! ఇదే తీరు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇఫ్పటికి ఐదుమార్లు తీర్మానించారు. ఈ తీర్మానాలు ఆ మహానుభావుడికి భారతరత్న అవార్డు ఇప్పించుకోవడానికా...! అవమానించడానికా...! అప్పుడంతా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా రాలేదనకునే వారు జనం. మరి ఇప్పడేమయ్యింది. బాబు అడిగితే భారతీయ జనతా పార్టీ కాదంటుందా..! లేక బాబు అడగలేదా.. ! సరియైన ప్రతిపాదన వెళితే ఎన్టీయార్ కు భారతరత్న వచ్చేస్తుందనేది చాలామంది అభిప్రాయం. మరి అడిగేవారెవరు? బాబు ఎందుకు అడగరు...? అదే మరి రాజకీయమంటే... !
 
కేంద్రంలోని టాప్ మోస్టు పెద్దలవరకూ ఎన్టీఆర్ గురించి తెలుసు. మోదీకి వివరించడానికి వెంకయ్యలాంటి వారు ఉండనే ఉన్నారు. కాదని ఏ బీజేపీ నాయకుడు అనగలరు చెప్పండి. కానీ అడిగేవారే లేరు. ఆ ప్రయత్నాలు మానేసి ప్రతీ మహానాడులో ప్రతిపాదనలు, తీర్మానాలు ఇదే వరస.. మొదటి రోజు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు భారతరత్న డిమాండ్ చేస్తే.. తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున అధికారకంగా ఈ డిమాండ్ చేస్తారు. అయితే మహానాడు వేదికగా ఈ డిమాండ్ చేస్తే ఏమిటీ ప్రయోజనం..? ఢిల్లీ టూర్‌కు వెళ్లినప్పుడు ఈ విషయంలో హోం శాఖతోనూ మాట్లాడి.. ప్రధాని మోదీకి ఎన్టీఆర్ గొప్పదనాన్ని వివరించేసి.. భారతరత్నను కన్ఫర్మ్ చేసుకురావొచ్చు. కానీ అలా జరగలేదెందుకు? 
 
అదే జరిగితే.. కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడానికి ఒప్పుకుంటే.. ఆ అవార్డు ఎవరు అందుకోవాలి...? నందమూరి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సతీమణి హోదాలో భారతరత్నను అందుకోవాలి. మరి ఆమెకు బాబుగారు అలాంటి అవకాశం ఎందుకు ఇస్తారు? అందుకే ఆయన ఎన్టీఆర్‌కు భారతరత్నను డిమాండ్ చేస్తూ ఉంటారు. తీసుకురావడానికి మాత్రం ప్రయత్నాలు చేయరనే పెద్ద చర్చ నడుస్తోంది.