అమరావతిలో బాబు టీం ఏం చేస్తోంది... భాజపా కేంద్ర నాయకులు ఆరా...? విశాఖపై గంటా ప్లాన్స్
విశాఖపట్నం: ఇటీవలి రాజకీయ పరిణామాలు టీడీపీ, బీజేపీల మధ్య కనిపించని అగాధాన్ని సృష్టించాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ పొత్తుతో కలిసిమెలిసి ఉండాల్సిన ఈ మిత్ర పక్షాలు లోలోన ద్వేషంతో రగిలిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా... రాష్ట్రానిక
విశాఖపట్నం: ఇటీవలి రాజకీయ పరిణామాలు టీడీపీ, బీజేపీల మధ్య కనిపించని అగాధాన్ని సృష్టించాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ పొత్తుతో కలిసిమెలిసి ఉండాల్సిన ఈ మిత్ర పక్షాలు లోలోన ద్వేషంతో రగిలిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా... రాష్ట్రానికి నిధులు సరిగా ఇవ్వకుండా వేధిస్తున్నారని టీడీపీ ఆవేదనతో ఉంది. కేంద్రం నుంచి అంతా మేం చేస్తున్నా... ఏపీలో మమ్మల్ని పూచికపుల్లలా తీసిపడేస్తున్నారని బీజేపీ ఆక్రోశిస్తోంది. పైగా, ఇపుడు బీజేపీ నేతలు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతి రాజధాని, విజయవాడలో చేపట్టే అభివృద్ధి పనులపై నిఘావేసి నివేదికలు కేంద్రానికి పంపుతున్నారు.
దీనితో ఇక ఏపీలో బీజేపీకి సీన్ కట్ చేయాలని టీడీపీ భావిస్తోంది. దీనికి తొలి అడుగుగా విశాఖ మేయర్ పదవిని చేజిక్కించుకుంటున్నారు. విశాఖ మేయర్ అభ్యర్థిగా టీడీపీవారే ఉంటారని మంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ బీజేపీ కార్పొరేషన్ పదవి కూడా తమ పార్టీకే ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే, విశాఖ ఎమ్మెల్యే సీటు ఇచ్చే తప్పుచేశామని, ఇపుడు మేయర్ పదవి కూడా ఇస్తే, విశాఖలో టీడీపీ పడిపోయి, బీజేపీ బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తమ బలంతో నెగ్గే బీజేపీ నేతలు తిరిగి తమపైనే ఎక్కి స్వారీ చేస్తారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మేయర్ సీటుపై బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, విష్ణుకుమార్ రాజులను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని మంత్రి గంటా తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఆయన ప్రకటించారు. అంటే, బీజేపీ వారైనా కావచ్చా...అంటే... నో...టీడీపీ వారే మేయర్ అవుతారనేది గంటా సమాధానం... ఇక అర్థం అయిందిగా... బీజేపీ సీన్ కట్ చేస్తున్నారని. దటీజ్ ఏపీ పాలిటిక్స్.