బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (14:08 IST)

మోడీకి సౌత్ క్లియర్... జయమ్మ జైలుకు.. సీన్ లోకి సూపర్ స్టార్ రజినీకాంత్...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడటంపై రాజకీయ వర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు వినిపిస్తోంది. తమిళనాట బీజేపీని స్థిరపరిచేందుకు నరేంద్ర మోడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను 2019 ఎన్నికల బరిలో దించేందుకు మోడీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీనికి తగ్గట్లుగానే అన్నాడీఎంకే అధినేత్రి జయమ్మకు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జైలు శిక్ష పడింది. 
 
ప్రస్తుత శిక్ష ప్రకారం ఆమె మరో 10 ఏళ్ల దాకా కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె వయసు 66. అంటే 76 ఏళ్ల దాకా ఆమె అసెంబ్లీ గడప తొక్కే వీల్లేదన్నమాట. అంటే దాదాపు అన్నాడీఎంకే పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి. 
 
అన్నాడిఎంకే పార్టీ పరిస్థితి ఇలావుంటే ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ కూడా తన ప్రాభవాన్ని కోల్పోయింది. యూపీఎ హయాంలో డీఎంకే భారీ అవినీతి కేసుల్లో చిక్కుకుంది. ఇందులో 2జీ కేసు కూడా ఉంది. డీఎంకే ఎంపీలుగా వ్యవహరించిన రాజా, కనిమొళిలు జైలు ఊచలు లెక్కపెట్టి వచ్చారు.

ఈ కేసు తాలూకు నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఆ పార్టీని. ఇలా అవినీతి, అక్రమాల ఊబిల్లో చిక్కుకుపోయిన ఈ రెండు ప్రాంతీయ పార్టీల భరతం పట్టాలని భరతం పట్టాలని భాజపా తలపోస్తున్నట్లు సమాచారం. తద్వారా భారతీయ జనతా పార్టీని తమిళనాట స్థిరంగా నిలబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు.
 
అందుకే తప్పు చేసిన వారిని ఏరివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితమే జయలలిత జైలుకెళ్లారని, ఇదేవిధంగా రాజా, కనిమొళిలకు కూడా జైలు తప్పదని.. ఇక మన రాష్ట్రంలో కోట్లాది రూపాయల అక్రమాస్తుల కేసులో సంబంధమున్నట్లు ఛార్జీషీట్లు తేల్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
మొత్తమ్మీద రెండు ద్రవిడ పార్టీలను మట్టికరిపించి రజీనీకాంత్ ఎంట్రీతో భాజపా కమలదళం వికసింపజేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో...?