శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (16:04 IST)

బీఫ్ చుట్టూ తిరుగుతున్న బీహార్ పాలిటిక్స్ : విమర్శలు.. ప్రతివిమర్శలు

బీహార్ రాష్ట్ర శాసనసభకు ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌ కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రచారం కాస్త.. బీఫ్ (ఆవు మాంసం) చుట్టూ పరిభ్రమించేలా విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఢిల్లీ శివారు ప్రాంతమైన దాద్రి (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం)లో ఆవును చంపి తిన్నారన్న కోపంతో గ్రామంలోని ముస్లిం కుటుంబ సభ్యులపై గ్రామస్థులంతా దాడి చేసి చితకబాదగా, ఈ దాడిలో కుటుంబయజమాని మృత్యువాతపడ్డాడు. అతని కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి, బీఫ్ మాంసం అంశం ఇపుడు ప్రధాన అస్త్రాలుగా మారిపోయాయి. 
 
ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. హిందువులు కూడా బీఫ్‌ తింటున్నారని బీజేపీ ఈ విషయాన్ని మతపరంగా మలుస్తూ విభజన తీసుకురావాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బీఫ్ అంటే ఆవు మాంసమొక్కటే కాదని లాలూ సెలవిచ్చారు. మటన్‌ తింటున్న వారికి అది ఆవుదా, మేకదా అని గుర్తించడం సాధ్యం కాదని చెప్పారు. ఆకలి చల్లార్చుకోవడానికి చౌక ధరకు లభించే గొడ్డు మాంసాన్ని హిందువులు కూడా తింటున్నారన్నారు. బీఫ్‌ విషయాన్ని బీజేపీ మతపరమైన విభజన కోసం ఉపయోగించుకుంటోందని కానీ బీహార్‌లో వారి ఆటలు చెల్లవని లాలూ హెచ్చరించారు. 
 
దీనిపై బీజేపీ కూడా అదే రేంజ్‌లో లాలూపై మండిపడింది. ఆర్జేడీ అధినేతకు పూర్తిగా మతిపోయిందంటూ తిప్పికొట్టింది. ముస్లింలను మచ్చిక చేసుకునేందుకే దాద్రి అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని లాలూ ప్రసాద్ తమపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడింది. దాద్రి దాడిని రాజకీయపరంగా చూడటం సరికాదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్. ఆరోపణలతో మనిషి ప్రాణం తీయడం దురదృష్టకరమనీ... అయితే అది మతానికి సంబంధించిన ఇష్యూ కాదంటూ ఈ అంశాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేశారు.