బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 16 మే 2017 (15:50 IST)

ముక్కంటి ప్రాంతంలో మూడు ముక్కలాట...! బొజ్జలకు మూడునామాలేనా?

క్రమశిక్షణకు మారుపేరుగా ఐక్యతలో దిట్టగా, ఏకనాయకత్వానికి ఉదాహరణగా ఉంటూ వచ్చిన శ్రీకాళహస్తి నియోజవర్గం తెలుగుదేశంపార్టీలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు. అధికార పార్టీ మూడు వర్గాలుగా ఉండటం, ఎవరికి

క్రమశిక్షణకు మారుపేరుగా ఐక్యతలో దిట్టగా, ఏకనాయకత్వానికి ఉదాహరణగా ఉంటూ వచ్చిన శ్రీకాళహస్తి నియోజవర్గం తెలుగుదేశంపార్టీలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు. అధికార పార్టీ మూడు వర్గాలుగా ఉండటం, ఎవరికి వారే అనుతీరుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి వర్గం, మున్సిపల్ ఛైర్మన్ వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులకు దిగడంతో పార్టీ పరువు బజారునపడుతోంది. ఇంత జరుగుతున్నా ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి అధిష్టానం ప్రయత్నించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆవేదనతో ఉన్నారు.
 
శ్రీకాళహస్తిలో అధికార తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు, వర్గవిభేదాలు, ఆందోళనలు, పోలీస్ ఫిర్యాదులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. గత మూడేళ్ళుగా మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు మాత్రమే రెండు వర్గాలుగా ఉంటూ వచ్చారు. తాజాగా గత యేడాది నుంచి మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి మూడో వర్గంగా తయారయ్యారు. ఎస్సీవీనాయుడు 2014ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినప్పటికీ ఆయన్ను బొజ్జల వర్గం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఎస్సీవీ నాయుడును బొజ్జల కార్యక్రమాలకు సైతం ఆహ్వానించలేదు. దీంతో ఎస్సీవీనాయుడు మాజీ మంత్రి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
అయితే ఇటు తన వర్గాన్ని టీడీపీ వైపు మలుచుకూంటూనే పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం సైతం ఎస్సీవీకి తగిన ప్రాధాన్యత ఇస్తుందనే ప్రచారముంది. తన పరిధిలో పార్టీ కార్యక్రమాలు చేపట్టడం మిగతా సమయాల్లో మిన్నకుండిపోతున్నారు. ఇదిలావుండగా బొజ్జల వర్గంగానే ఉంటూ వచ్చిన మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారారు.
 
ఛైర్మన్ వర్గంగా ముద్రపడిన కంఠా ఉదయ్‌ను, మరో కౌన్సిలర్‌ను మాజీ మంత్రి వర్గంగా పేరుపడిన టౌన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ భర్త దుర్భాషలాడి, దాడి చేశారంటూ గతంలోనే ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మరోసారి వివాదాలు రోడ్డున పడ్డాయి. అంతకుమునుపు జరిగిన మున్సిపల్ సమావేశంలో అధికార పార్టీలోని ఓ వర్గం కౌన్సిలర్లు ఛైర్మన్ వర్గానికి వ్యతిరేకంగా కౌన్సిల్ హాలులోనే ఆందోళనకు దిగారు. 
 
ఛైర్మన్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానే తాము నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార తెలుగుదేశం పార్టీలోనే ఇటు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ ఎవరికి వారుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించేవారు. అధికం కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం స్పందించి నేతలను ఏకతాటిపైకి తీసుకురావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.