శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2015 (19:04 IST)

లోలోపల బీజేపీ-టీడీపీ ఫైర్: బయటికి మాత్రం భాయిభాయి.. అసలేం జరిగింది?

బీజేపీ-టీడీపీల మధ్య వార్ జరిగేందుకు అంతా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిపై టీడీపీ లోలోన రగిలిపోతోంది. కానీ బయటకు మాత్రం భాయిభాయి అనుకుంటున్నారు. టీడీపీ-బీజేపీల మధ్య సంబంధాల్ని కటీఫ్ చేసుకోవాలని ఇరు పార్టీలు లోలోపల అనుకుంటున్నప్పటికీ.. ఒకరిపై ఒకరికి అసంతృప్తి ఉన్నా వాటిని కడుపులోనే దాచుకుంటాయి. అయితే స్థానిక క్యాడర్ మాత్రం బయటపడిపోయింది. 
 
ఏపీ దేవాదాయ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం - బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య గొడవ రాజుకుంది. ఇందుకు పశ్చిమ గోదావరి మున్సిపల్ సమావేశం వేదికైంది. టీడీపీ-బీజేపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో ఇరు పార్టీలకు ఏకాభిప్రాయం కుదరట్లేదని.. ఇక ఉండలేమని బీజేపీతో టీడీపీ తేల్చి చెప్పేసినట్లు సమాచారం.  
 
మున్సిపల్ సమావేశంలో టీడీపీ-బీజేపీకి చెందిన రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. టీడీపీ అన్యాయం చేస్తోందని బీజేపీ, రాష్ట్రాన్ని అనాధ చేస్తున్నది బీజేపీనే అంటూ టీడీపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. మరి ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.