శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (14:36 IST)

ఢిల్లీకి డెంగ్యూ జ్వరం... 15 మంది మృత్యువాత.. చేతులెత్తేసిన ఆప్ సర్కార్

ఢిల్లీకి డెంగ్యూ జ్వరం సోకింది. ఫలితంగా ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 1800 మందికి పైగా ఈ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో ఢిల్లీ ఆస్పత్రులన్నీ డెంగ్యూ జ్వర పీడితులతో నిండిపోయింది. మరికొంతమంది హై ఫీవర్‌తో ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. డెంగ్యూ అనుమానంతో టెస్టులు చేయించుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆస్పత్రులు అడ్మిషన్లు నిరాకరించడంతో చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఏడేళ్ల పిల్లాడిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో ఆ చిన్నారి చనిపోవడం... అది తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
 
మరోవైపు డెంగ్యూతో జనం ప్రాణాలు కోల్పోతుంటే వివిధ పార్టీలు మాత్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణం వల్లే డెంగ్యూ ప్రబలుతుందని.. దానికి కారణం మీరంటే మీరంటూ అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కూడా నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేషెంట్లను చేర్చుకోకుండా వైద్యాన్ని నిరాకరిస్తే... కఠిన చర్యలు తప్పని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.
 
మరోవైపు డెంగ్యూ జ్వరపీడితుల పట్ల ఆస్పత్రులు అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు ఆప్ సర్కారుకు అంక్షితలు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జనం ప్రాణాలు పోతుంటే.. చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. డెంగ్యూ సోకిన బాలుడికి వైద్యం చేసేందుకు ఆస్పత్రి డైరెక్టర్‌పై కేసు పెట్టాలని ఆదేశించింది. డెంగ్యూ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టమైన నివేదికను సమర్పించాలంటూ ఆరవింద్ కేజ్రీవాల్ సర్కారును ఆదేశించింది.