వైకాపాలో జంపింగ్ల గోల.. పార్టీ మారాలంటే.. ఫేస్ బుక్ ప్రొఫైల్ మార్చేస్తే పోలా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీకి జంపింగ్ గోల పెరిగిపోతోంది. రోజు రోజుకొకరు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో త్వరలో వైకాపా ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. సీఎం చంద్రబాబు నివాసంలో బుడ్డా పసుపు కండువా కప్పించుకున్నారు.
బుడ్డా పార్టీ మారడంలో స్పెషాలిటీ ఏంటంటే..? బుడ్డా పార్టీ మారాలనుకున్న వెంటనే తన ఫేస్ బుక్ ఫ్రొఫైల్ను మార్చేశారు. వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయ్యేందుకు ఒక రోడు ముందుగానే ప్రొఫైల్ మార్చేయడం గమనార్హం. నిన్నటివరకు ఫేస్ బుక్ ఖాతాలో వైసీపీ నేతగా కనిపించిన బుడ్డా.. నేటి నుంచి పసుపు పార్టీలో ఎమ్మెల్యేగా మారిపోయారు. ఫేస్ బుక్లోని వైసీపీ రంగుకు బదులు టీడీపీ రంగైన పసుపు పూసేశారు.
అంతేకాదు.. బుడ్డా పార్టీ మారిన కూడా కొత్తగానే ఉంది. 35 బస్సుల నిండా తన కార్యకర్తల్ని రాత్రి విజయవాడకు తరలించారు. అయితే ఫేస్ బుక్ ప్రొఫైల్ మార్చి.. లారీ జనంతో టీడీపీకి వెళ్ళిన బుడ్డాను వైసీపీ ఫ్యాన్స్ మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.