గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై కేకే కుమార్తె?.. కేసీఆర్ నిర్ణయం!
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవిని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు కుమార్తెకు కట్టబెట్టాలని టీ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి తమ వారసులు కూడా రాజకీయంగా ఎదగాలని ప్రతి నాయకుడు కోరుకుంటారు. ఈ లిస్టులో టీఆర్ఎస్ ముఖ్యనేత కె.కేశవ రావు కూడా చేరిపోయారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి తేవాలని భావించిన కేకే… అతడు అప్పట్లో ఓ హత్యకేసులో ఇరుక్కుని అభాసుపాలవడంతో… కూతురికి రాజకీయ వారసత్వం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.
కూతురు విజయలక్ష్మీని కొన్నాళ్ల క్రితమే టీఆర్ఎస్ లో చేర్పించిన కేకే… ప్రస్తుతం ఆమెను గ్రేటర్ బరిలో కార్పొరేటర్గా నిలబెట్టడం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే టీఆర్ఎస్లోని కొందరు ముఖ్యనేతలు మాత్రం కేకే కూతురు కార్పొరేటర్గా పోటీ చేయడం వెనుక పెద్ద వ్యూహామే ఉందని చర్చించుకుంటున్నాయి.
టీఆర్ఎస్కు సొంతంగా మెజార్టీ లభిస్తే… తన కూతురిని మేయర్ చేయాలని కేశవరావు… కేసీఆర్ను కోరారట. కేసీఆర్ సైతం కేకే సూచనకు సానుకూలంగా స్పందించారని సమాచారం. తాజాగా గ్రేటర్ మేయర్ పీఠం కూడా బీసీ మహిళకే రిజర్వ్ కావడంతో… ఇక టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి కేశవరావు కూతురే అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక గ్రేటర్ పరిధిలో తనకు పరిచయం ఉన్న కాంగ్రెస్ నేతల్లో చాలామందిని టీఆర్ఎస్లో చేరేందుకు కేకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి… తన రాజకీయ వారసురాలికి కీలక పదవి ఇప్పించాలని తపిస్తున్న కేకే ఆశలు ఎంతవరకు నెరవేరతాయో వేచిచూద్ధాం.