శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శనివారం, 12 ఆగస్టు 2017 (17:56 IST)

తిరుమలకు తుపాకులు ఎందుకు తీసుకెళుతున్నారు..?

తిరుమలలో గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు నిషేధిత వస్తువులైన తుపాకులను తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది భక్తులు. తుపాకీలను తీసుకొచ్చే వారు తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో అర్థం కాని పర

తిరుమలలో గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు నిషేధిత వస్తువులైన తుపాకులను తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది భక్తులు. తుపాకీలను తీసుకొచ్చే వారు తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు టిటిడి సెక్యూరిటీ, పోలీసు అధికారులు.
 
ఏడుకొండలవాడి భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. కనీసం గుట్కా, సిగెరెట్లు లాంటి చిన్న చిన్న నిషేధిత వస్తువులే కొండపైకి తీసుకెళ్ళడానికి వీళ్ళేదు. కానీ ఈ మధ్య ఏకంగా తుపాకీలనే కొండపైకి తీసుకెళుతూ దొరికిపోయిన సంధర్భాలు ఉన్నాయి. అయితే దొరికినప్పుడు హడావిడి చేయడం తప్ప వారు ఏ ఉద్దేశంతో వాటిని తీసుకెళుతున్నారు. వాటికి లైసెన్సులు ఉన్నాయా...లేవా అన్న విషయాలపై మాత్రం టిటిడి విజిలెన్స్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ గన్స్ ను భక్తులు ఎందుకు తీసుకెళుతున్నారు. దీనివెనుక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా..
 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుమల. వివిధ దేశాల నుంచి నిత్యం భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా స్వామివారికి నిరంతరం కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని చూడడం కోసం ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అంతమంది భక్తజనం ఒకచోట గుమిగూడే ప్రాంతం కావడంతో భద్రత పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒకవైపు సెంట్రల్ ఫోర్స్‌తో పాటు మరోవైపు పోలీసులు బలగాలు, దానికి తోడు టిటిడికి ప్రత్యేకంగా విజిలెన్స్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. 
 
కొండపైకి వెళ్ళే భక్తుడు ఇటు కాలినడకన కావచ్చు..అటు రోడ్డుమార్గం ద్వారా కావచ్చు..అలా వెళ్ళే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే పైకి వెళ్ళడానికి అనుమతిస్తారు. వాహనాలను కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తారు. ఈ తనిఖీల్లో గతంలో అనేక  నిషేధిత వస్తువులు దొరికాయి. మద్యం, మాంసంతో పాటు గుట్కాలు, సిగరెట్లు లాంటి వస్తువులను కొండమీదకు అనుమతించరు. అలా అనుమతి లేని వస్తువులను తెచ్చిన చాలా మంది నుంచి అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర విజిలెన్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. 
 
అయితే ఈ మధ్యకాలంలో ఈ తనిఖీల్లో తుపాకీలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్కువగా ఉత్తర భారతదేశానికి చెందిన భక్తులే వీటిని తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇక్కడి నియమ నిబంధనలు వారికి తెలియకపోవడం వల్లే వాటిని తీసుకొస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వీటికి అస్సలు అనుమతి ఉందా..గన్నులు తెస్తున్న వారు ఎవరు..వారికి గన్స్ మెయింటెన్స్ చేసేంత స్థాయి ఉందా అన్న విషయాలను పట్టించుకోవడం మానేశారు. 
 
గన్స్ దొరికినప్పుడు హడావిడి చేయడం తప్ప తరువాత తెచ్చిన వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు టిటిడి విజిలెన్స్. ఒక్కసారి ఇలా గన్స్ దొరికితే వారికి జరిమానా వేయడమో..లేదా దానిపైన పూర్తిస్థాయి ఎంక్సైరీ చేయడం చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడచ్చుంటున్నారు భక్తులు. తనిఖీలు క్షుణ్ణంగా చేసినప్పుడు గన్నులు దొరుకుతున్నాయి ఓకే..కానీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న టైంలో ఇలాంటి గన్స్ నిజంగా కొండపైకి చేరితే ఏంటన్నది మరికొంతమంది భక్తుల ప్రశ్న.
 
ఇప్పటికే పవిత్రమైన తిరుమల కొండపై అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆయుధాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. విజిలెన్స్ అధికారులు కూడా మరింత అప్రమత్తంగా తనిఖీలు చేయకపోతే తిరుమల భద్రతకే విఘాతం కలిగే అవకాశముంది.