మిర్చిని మర్చిపోయారు.. అమరావతిపై పడ్డారు... గుంటూరు ప్రజల ఆవేదన
గుంటూరు: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరం పరిస్థితి. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చిందనే పేరే గాని, నగరం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. వర్తమాన కాలంలో కనీస వసతులు
గుంటూరు: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరం పరిస్థితి. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చిందనే పేరే గాని, నగరం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. వర్తమాన కాలంలో కనీస వసతులు కూడా లేక గుంటూరు ప్రజలు అల్లాడుతున్నారు. నీటి వసతి అరకొర... సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేదు. భూగర్భ మురుగు నీటి పారుదల సౌకర్యం లేదు. విమానాశ్రయం లేదు. వినోద సాధనాలు, పార్కులు లేవు. అంతర్గత రహదారుల అభివృద్ధి లేదు.... ఇలా ఎన్నో సమస్యలున్నా పట్టించుకునే నాధుడు లేడు.
నాడు గుంటూరుకు ఘన చరిత... నేడు కాలగర్భంలో భవిత!
గుంటూరు పూర్వ నామధేయం గర్తపురి. వేయి సంవత్సరాల చరిత్ర గల గుంటూరుని శాతవాహనులు, రెడ్డి రాజులు పరిపాలించారు. ప్రస్తుత పాత గుంటూరే అసలు ఊరు. అక్కడే వేయి సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని శివలింగం ప్రతిష్ఠించారు. అదే నేటికీ పూజలందుకుంటున్న అగస్తేస్వర ఆలయం. గుంటూరు 1868 లోనే పురపాలక సంఘం అయింది. (విజయవాడ 1883లో అయింది). 1994లో కార్పొరేషన్ అయింది. మొదట కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న గుంటూరు 1904లో ప్రత్యేక జిల్లా కేంద్రం అయింది. అఖండ భారతంలో పౌరుడుగా ఉన్న మహమ్మదలీ జిన్నా పేరుతో టవర్ నిర్మించారు.
దేశ విభజనకు కారకుడైన అతడి పేరు తొలగించి గాంధీజీ పేరు పెట్టాలి అనే డిమాండ్ ఉంది. ఇక్కడి గాంధీ పార్కులో ఎన్నో చారిత్రక సభలు జరిగాయి. ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, వాజ్పాయి, అద్వానీ, చరణ్ సింగ్, సుందరయ్య లాంటి ఉద్దండులు ప్రసంగించారిక్కడ. గుంటూరులో కలెక్టరులుగా పనిచేసిన బ్రిటిషర్లు పేర్లతో అరండేల్ పేట, బ్రాడీపేట ఏర్పడ్డాయి. తరువాత కాలంలో అరండేల్ పేటని గాంధీ పేటగా, బ్రాడీపేటని తిలక్ పేటగా మార్చారు. అయినా అవి ప్రాచుర్యం పొందలేదు. 136 సంవత్సరాల చరిత్ర కల ఏ.సి.కాలేజీ, 104 సంవత్సరాల ఉమెన్స్ కాలేజీ, 80 సంవత్సరాల హిందూ కాలేజీ, లాం ఫారం గుంటూరు కిరీటంలో కలికితురాళ్ళు.
గుంట అంటే ఎకరంలో నాలుగో వంతు....
గుంటూరు అనే పేరు రావడానికి రెండు కారణాలు చెప్తారు. 1. గుంట అంటే ఎకరంలో నాలుగో వంతు. అంత స్థలంలో మొదట ప్రారంభం అయింది కాబట్టి గుంటూరు అనే పేరు వచ్చింది. 2. ఈస్టిండియా కంపెనీ కాలంలో మధ్యాహ్నం 12.00 గంటలకు గుర్తుగా ఫిరంగి గుండు పేల్చేవారు. గుండు పేల్చటం వల్ల గుండూరు అయి కాలక్రమంలో గుంటూరు అయింది. ఇప్పుడు గుంటలూరుగా ప్రసిధ్ధి చెందింది. మిరప, పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలకు కేంద్రమైన గుంటూరుకి సుగంధ నగరం (spicy city) అనే పేరుంది. దేశానికి కోట్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది. గుంటూరు నగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం కేవలం అమరావతిపైనే దృష్టి పెట్టడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.