బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (16:41 IST)

"నగదు రహితం" ఎవరి ''హితం'' కోసం? రూ. 500కి రూ.1,00,000 కమీషనా...?

ప్రస్తుతం అందరి నోటా వింటున్న మాట, "క్యాష్‌లెస్". నరేంద్ర మోడీ, చంద్రబాబు, కేసీఆర్... అందరూ ఇదే పాట పాడుతున్నారు. క్యాష్‌లెస్ అంటే నగదు లేకుండా కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా పేటీయంల ద్వా

ప్రస్తుతం అందరి నోటా వింటున్న మాట, "క్యాష్‌లెస్".  నరేంద్ర మోడీ, చంద్రబాబు, కేసీఆర్... అందరూ ఇదే పాట పాడుతున్నారు.
క్యాష్‌లెస్ అంటే నగదు లేకుండా కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా పేటీయంల ద్వారా చెల్లింపులు చేయడమన్నమాట.
ఈ నగదు రహిత లావాదేవీల ద్వారా ఎవరికి లాభమో ఒకసారి చూద్దాం.
 
మొదటగా పూర్వంలా నగదు చెల్లింపు ద్వారా ఉండే పద్ధతి వుండివుంటే...ఒక 500 రూపాయల నోటు తీసుకుని...
 
1) వెంకన్న హెరిటేజ్ షాప్‌కి వెళ్లాడు. దానితో కూరలు కొన్నాడు.
2) ఆ 500 నోటు తీసుకుని హెరిటేజ్ షాప్ వాడు కూరగాయల వర్తకుని నుంచి కూరలు కొన్నాడు.
3) కూరగాయలతను ఆ 500 నోటుతో ఎరువుల షాపులో ఎరువులు కొన్నాడు.
4) ఎరువుల షాపతను ఆ 500 నోటుతో ఎరువుల ఫ్యాక్టరీకెళ్లి ఎరువులు కొన్నాడు.
5) ఎరువుల ఫ్యాక్టరీ యజమాని ఆ 500 నోటును తన కార్మికునకు ఇచ్చాడు.
6) కార్మికుడు ఆ 500 నోటుతో బట్టల షాప్‌కి వెళ్లి బట్టలు కొన్నాడు.
7) బట్టల షాప్ ఓనర్ ఆ 500 నోటుతో టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు కొన్నాడు.
8) టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ యజమాని ఆ 500 నోటుతో ప్రత్తి రైతు నుంచి ప్రత్తి కొన్నాడు.
9) ప్రత్తి రైతు ఆ 500 నోటుతో పిల్లల స్కూల్ ఫీజ్ కట్టాడు.
10) స్కూల్ యాజమాన్యం ఆ 500 నోటును బస్ డ్రైవర్‌కి ఇచ్చింది.
 
ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 500 నోటు చిరిగి పోయేవరకూ అంటే సుమారు 10000 మంది చేతులు మారవచ్చు. ఈ లావాదేవీల్లో కొనుగోలుదారుకి కానీ, అమ్మకందారుకి కానీ ఎటువంటి అదనపు చార్జీలు పడవు. హాయిగా ఆ నోటుతో లావాదేవీలు జరపవచ్చు.
 
అదే పై లావాదేవీలన్నీ కార్డ్ ద్వారా కానీ పేటీయం ద్వారా కానీ జరిపితే...
ప్రస్తుతానికి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయమని చెపుతున్నారు కానీ, వాళ్లేమైనా మన బంధువులా ఉచిత సర్వీస్ చేయడానికి? మనకి ఉచిత సర్వీస్ చేయడం వలన వాళ్లకి వచ్చే లాభమేమిటి?
ఇప్పుడు కాకపోయినా, కొద్ది రోజుల తరువాతనైనా ప్రతీ లావాదేవీ మీద 2% చార్జి వసూలు చేయడం తప్పనిసరి.
ఇప్పుడు, పైన చెప్పిన లావాదేవీలని ఆన్ లైన్ సంస్థ ద్వారా చేస్తే ఆ సంస్థకి ఎంత కమీషన్ వస్తుందో చూద్దాం...
 
500 రూపాయలకి 2% అంటే 10 రూపాయలు చొప్పున...
1) వెంకన్నకి చార్జి....  రూ. 10
2) హెరిటేజ్‌కి చార్జి....   రూ.10
3) కూరగాయలతనికి....రూ. 10
4) ఎరువులషాపతనికి..........10.00
5) ఎరువుల ఫ్యాక్టరీకి...........10.00
6) కార్మికునికి..................10.00
7) బట్టలషాపతనికి..............10.00
8) టెక్స్ టైల్ ఫ్యాక్టరీకి...........10.00
9) ప్రత్తి రైతుకి......................10.00
10) స్కూల్‌కి.......................10.00
ఇలా ఆ 500 నోటు 10000 మంది చేతులు మారితే అయ్యే చార్జీల మొత్తం.
10000 X 10 = 1,00,000/-
అంటే ఒక్క 500 నోటుకి సుమారు 1,00,000/- చార్జీల బాదుడు ఆ పేటీఎం మొదలైన సంస్థలకి అప్పనంగా చెల్లిస్తాం. కేవలం ఒక్క 500 రోపాయల నోటుకే అంత డబ్బు చెల్లిస్తే, మనకి చెలామణిలో వున్న 18,00,000 కోట్ల రూపాయలకి ఎంత చెల్లిస్తామో ఒక్కసారి ఆలోచించండి?
 
ఇదంతా ఎవరిని పోషించడానికి?
దీనివల్ల లాభపడేదెవరు?
"నగదురహితం" పాట పాడుతున్న నాయకులు ఎవరి మేలుకోసం ఈ పనిచేస్తున్నారు?? 
వీళ్ళు ఇంతగా దిగజారి కార్పొరేట్లకు బానిసగిరీ చేయడం అవసరమా?
మనకు ఈ నగదురహిత లావాదేవీలు అవసరమా?
ఆలోచించండి...!!

- మీలో ఒకరు