శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : సోమవారం, 7 జులై 2014 (13:59 IST)

రోజుకు రూ.32 ఖర్చు పెడితే మీరు ధనవంతులే!

మేధావులమని చెప్పుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు.. ఆర్థికవేత్తలకు సమాజంలో ఆర్థిక స్థితిగతుల గురించి పెద్దగా తెలిసేలా లేవు. ఒకవైపు దేశంలో నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ రాజకీయ పార్టీలు, ప్రజలు గగ్గోలు పెడుతుంటే కేంద్రం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీకి ఈ ఆర్తనాదాలు వినిపించడం లేదు. అందుకే రోజుకు 32 రూపాయలు ఖర్చు చేసే వారంతా ధనవంతుల కిందకి జమకట్టేసింది. 
 
ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ బియ్యం ధర 30 రూపాయలు దాటిపోయింది. చివరకు ప్రభుత్వం పథకం కింద అందించే నీరు కూడా 2 రూపాయలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో రోజుకు 32 రూపాయలు, నగరాల్లో 47 రూపాయలు ఖర్చు పెట్టేవారంతా ధనికులేనని కేంద్రానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెను దుమారమే లేపింది.
 
అధికార, విపక్ష నేతలంగా నిపుణుల నివేదికపై అభ్యంతరం చెబుతున్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే దీనిపై మండిపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారే అని స్పష్టం చేయగా, ఈ కమిటీ రోజుకి 33 రూపాయలు ఖర్చు చేస్తే పేదలుకాదని తేల్చింది.
 
ఈ లెక్కన పేదలు కానివారంతా ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉన్నారని నిపుణులు కమిటీ స్పష్టం చేస్తోంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంగరాజన్ కమిటీ రోజుకు 100 రూపాయలు ఇచ్చి ఎలా బతకాలో నేర్పాలని నిపుణుల కమిటీని ప్రశ్నించిందని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.