గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (17:09 IST)

భారత్‌లో ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ ఎలా ఆకర్షిస్తోందంటే...

భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదంపై ముస్లిం యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారో.. ఎలా ఆకర్షితలవుతున్నారో తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భారత్ అత్యంత ప్రభావ దేశంగా ఎదగడాన్ని ఇసిస్ తీవ్రవాదులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు భారీ ప్రణాళికలే రూపొందిస్తున్నారు. 
 
ముఖ్యంగా భారత్ అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు దేశంలో అస్థిరతను నెలకొల్పేందుకు ఇసిస్ ఉగ్రవాదులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం వారు సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించేందుకు ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారత్‌లో మతమౌఢ్యంలో ఉన్న యువకులను ప్రలోభపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలను ముస్లిం యువకులకు విడమరచి చెబుతూ, భారత్‌ను ముస్లిం వ్యతిరేక దేశంగా చిత్రీకరిస్తున్నారు. అదేక్రమంలో ఇస్లాం రాజ్య స్థాపనలో అహరహం శ్రమిస్తున్నామని, దైవరాజ్య స్థాపనలో భాగం కావాలని యువతకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 
దీంతో భావోద్వేగానికి గురైన యువకులు ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముఖ్యంగా ఐఎస్ఐఎస్ భారత ప్రభుత్వ మూలాలపై దెబ్బ కొట్టాలని భావిస్తోంది. గతంలో కేరళ ప్రభుత్వ సైట్లలో అక్రమంగా ప్రవేశించిన తీవ్రవాదులు అక్కడ ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన నినాదాలు ఉంచారు. దీనిని కేరళ హ్యాకర్స్ బృందం తీవ్రంగా పరిగణించింది. కేరళ ప్రభుత్వ సైట్లు స్తంభింపజేసిన క్షణాల్లోనే ఐఎస్ఐఎస్‌కు చెందిన సైట్లలోకి వైరస్‌ను ఎక్కించి వాటిని స్తంభింపజేశారు. అంతటితో ఆగని కేరళ హ్యాకర్స్ బృందం ఐటీలో ఐఎస్ఐఎస్ ఇంకా అమ్మ కూచి అని, భారత్ ఐటీ పరిశ్రమతో ఆటలాడవద్దని స్పష్టం చేసింది.
 
అలాగే మత అసహనంపై సానుభూతి పరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహిస్తూ, ఔత్సాహికులను ఆకట్టుకుని, సానుభూతిపరులను గుర్తిస్తోంది. కాగలకార్యాన్ని వారితో పూర్తి చేయవచ్చని భావిస్తోంది. అయితే, మతం మత్తులో పడిన యువతను నిరోధించడం శ్రమతో కూడుకున్న పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదేసమయంలో మత పెద్దల సహకారం, సక్రమమైన మతబోధనలు అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.