గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2016 (13:06 IST)

మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లినా ఫర్లేదు... వైకాపా జగన్ మారరా...? అయ్యో....

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఐతే ఇలా ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మాత్రం ఆందోళన కనబడటం లేదు. పైగా మరో ముగ్గురు నలుగురు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఐతే ఇలా ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మాత్రం ఆందోళన కనబడటం లేదు. పైగా మరో ముగ్గురు నలుగురు వెళ్లినా ఏమీ ఫర్వాలేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలతో సొంత ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ చేయగా మరో ముగ్గురు నలుగురు వెళ్లినా ఫర్వాలేదు అంటే తెదేపాలోకి వెళ్లాలనుకునేవారు ఇంకా వైకాపాలో ఉన్నారనే సంకేతాలు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 
జగన్ వ్యవహార శైలి కారణంగా వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటూ తెదేపా చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగా జగన్ వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయన్న వాదనలు సైతం ఇప్పుడు వస్తున్నాయి. ఇదిలావుంటే శనివారం నాడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి పైన ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా పార్టీ ఫిరాయింపులకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోందనీ, ఈ విషయమై ఏపీ స్పీకరుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తమ పార్టీ నుంచి మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు జారిపోయినా ఏమీ ఫర్వాలేదంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే తాజాగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన వైకాపా ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం టీడీపీలో చేరారు. భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి విజయవాడకు వచ్చిన చాంద్ బాషా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు సమక్షంలో సొంత గూటికి చేరారు. శుక్రవారం రాత్రే కదిరి నుంచి బయలుదేరిన చాంద్ బాషా... శనివారం ఉదయం నేరుగా చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నాక... చంద్రబాబు నివాసం వద్దే చాంద్ బాషా టీడీపీలో చేరిపోయారు. చాంద్ బాషా చేరికతో ఇప్పటిదాకా వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.
 
మరోవైపు... ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మరో ప్రచారాస్త్రాన్ని విసిరారు. ఇంకా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని, వారితో తాము జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయన్న ఈ ప్రచారంతో వైసీపీలో తీవ్ర ఆందోళన నెలకొంది.