గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (15:41 IST)

హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు... కాపుల విధ్వంసానికి కారణమదే!

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన కాపుల విధ్వంసానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కాపు నేతలు దుయ్యపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లోకి చేరుస్తామంటూ హామీ ఇచ్చారు. కాపుల అభివృద్ధి కోసం బీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తానని ప్రకటించారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండు హామీలను విస్మరించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం.. ఈ రెండు అంశాలనే ప్రధానంగా చేసుకుని గర్జనకు దిగారు. ఈ గర్జన అదుపుతప్పి విధ్వంసానికి దిగారు. దీంతో కాపుల రిజర్వేషన్ అంశం మరోమారు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. 
 
అయితే, చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా కాపులను బీసీల్లో చేర్చడం అంత సులభం కాదు. ఇందుకు ఎన్నో అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా చరిత్రను తవ్వి తీస్తున్న కొందరు బీసీల్లో ఉన్న కాపుల్ని ఓసీలుగా మారుస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.
 
ఆసక్తికరంగా అలా చేసిన ప్రభుత్వాధినేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. 1910 నుంచి 1956 వరకు కాపులు బీసీల్లోనే ఉంటే.. నీలం సంజీవరెడ్డి సీఎం అయ్యాక వారిని ఓసీల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దామోదరం సంజీవయ్య సీఎం అయ్యాక 1961లో కాపులను బీసీలుగా గుర్తించారు. అయితే 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాపుల్ని ఓసీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. 
 
ఇక కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ 1993లో నాటి ముఖ్యమంత్రి విజయ భాస్కర్‌ రెడ్డిని కలుసుకునేందుకు ప్రయత్నం చేయగా వారిపై లాఠీఛార్జ్‌ జరపడం అప్పట్లో సంచలనంగా మారి.. వివాదాస్పదమైంది. ఈ ఘటనకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయటంతో జీవో 30 జారీ చేశారు. మొత్తంగా చూస్తే కాపులను దెబ్బ తీసింది ఒక సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులేనన్న వాదన వినిపిస్తోంది.