శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (16:04 IST)

కార్గిల్ యుద్ధ విజయానికి నేటికి పదిహేనేళ్ళు!

కార్గిల్ విజయానికి శుక్రవారంతో 15 యేళ్లు పూర్తవుతున్నాయి. 15 యేళ్ల క్రితం అంటే 1999 జూలై 26వ తేదీన కార్గిల్‌లో భారత సైన్యం త్రివర్ణ పతాకం ఎగురవేసింది. కార్గిల్ యుద్ధం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచు పర్వత ప్రాంతంలో భారత, పాకిస్థాన్ దేశాలు హోరాహోరీగా తలపడ్డాయి. కొంత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్థాన్ సైనికులను భారత సైనిక దళాలు తరిమితరిమికొట్టాయి. 
 
ఆ సమయంలో కార్గిల్ ప్రాంతాన్ని భారత్ కోల్పోయినట్టయితే అది భారతీయులందరికీ గుండెకోతను మిగిల్చి వుండేది. లఢక్ లాంటి ప్రాంతాలు పాకిస్థాన్ సొంతం అయిపోయి వుండేవి. ఆ దారుణం జరగకుండా వుండటానికి భారత సైనికులు వీరోచితంగా తమ ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ యుద్ధంలో 537 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. 1363 మంది సైనికులు గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్‌లను కూలిపోయాయి. 
 
ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. ఇక అటువైపు పాకిస్థాన్‌కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. ఫలితంగా ఎంతో మంది సైనిక వీరులను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ భారతదేశం వైపు వక్రబుద్ధితో చూస్తే తగిన శాస్తి తప్పదన్న గుణపాఠాన్ని పాకిస్థాన్‌కి ఇవ్వగలిగాం. 
 
సాధారణంగా చలికాలంలో సరిహద్దు సైనిక పోస్టులను ఇరు దేశాల సైనికులూ వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999 శీతాకాలంలో పాకిస్థానీ సైనికులు తమ పోస్టులను వదలలేదు. భారత్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. మిలిటెంట్ల రూపంలో పాకిస్థానీలు చొరబడ్డారు. ఈ విషయం మే నెలలో భారత్ దృష్టికి వచ్చింది. దీంతో కార్గిల్ జిల్లాలోని సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచు పర్వతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు భారత సైన్యం యుద్ధం చేయాల్సి వచ్చింది. 
 
కార్గిల్ లడఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్‌కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్‌లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్థాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది.
 
అయితే, ఈ యుద్ధం వల్ల భారత్‌కు ఎక్కువ నష్టమే జరిగినప్పటికీ.. శత్రుదేశమైన పాకిస్థాన్‍ని అంతర్జాతీయంగా దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతీశాం. ఈ యుద్ధం తర్వాత పాకిస్థాన్‌లో ప్రభుత్వమే మారిపోయింది. ముఖ్యంగా పాకిస్థాన్‌ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది.