శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మే 2016 (18:35 IST)

తెలంగాణలో వైకాపా డెడ్.. వెంటిలేటర్‌పై టీడీపీ అంటోన్న కేటీఆర్: రేవంత్‌ వాట్ నెక్ట్స్...?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొనఊపిరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన బ్రాంచ్ ఆఫీసును క్లోజ్ చేసేసుకుంది. తెలంగాణ వైకాపా అధ్యక్షుడు పొంగులేటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. పొంగులేటిని తెరాసలోకి ఆహ్వానించేందుకు ఆయన నివాసానికే వెళ్లారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగులేటి చేరికతో తెలంగాణలో ఆంధ్రా పార్టీ ఒకటి (వైకాపా) డెడ్ అయ్యిందని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా ఇలానే అంతర్థానమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పొంగులేటి రాకతో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి మరింత బలపడుతుందని.. ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుందని కేటీఆర్ ఆకాంక్షించారు.  
 
మరోవైపు తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తప్పదని తెలిసి.. ఏపీ ప్రజల ప్రయోజనం కోసం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్షను విరమించుకున్నట్లే తాను కూడా ఖమ్మం ప్రజల ప్రయోజనం కోసమే అధికార తెరాసలోకి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఎంపీ పొంగులేటి వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనం, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తెరాస సర్కారుకు సహకరించేందుకు తానీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
 
ఇకపోతే.. తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు మనుగడ కష్టమనే టాక్ వస్తోంది. ఇప్పటికే వైకాపాకు పొంగులేటి జంప్‌తో కష్టాలు వచ్చిన నేపథ్యంలో.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. తెలంగాణలో ఓ ఆంధ్రా పార్టీ అంతర్థానమైందని, భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి కూడా అంతేనని కేటీఆర్ వ్యాఖ్యల వెనుక తదుపరి ప్లాన్ అంతా తెదేపాను తెలంగాణలో లేకుండా చేయడం పైనేనని అంటున్నారు.
 
ఈ కామెంట్స్ వెనుక టీటీడీఎల్పీ నేత, తెలంగాణలో తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ గాలం వేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వలలో రేవంత్ రెడ్డి చిక్కకపోవడంతోనే పొంగులేటిని పార్టీలోకి లాగేయడం జరిగిందని.. రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో క్లోజ్ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గులాబీ జెండాకు పచ్చజెండా ఊపుతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.