శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (18:03 IST)

నోట్ల రద్దుతో సామాన్యులను మోదీ హింసిస్తున్నారా? బడా బాబుల రుణ మాఫీతో రెడ్ కార్పెట్టా?

పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసి 9 రోజులు గడిచిపోయింది. గడిచిన 9 రోజుల్లో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. 40 మంది సామాన్య ప్రజలు కొత్త నోట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు

పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసి 9 రోజులు గడిచిపోయింది. గడిచిన 9 రోజుల్లో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. 40 మంది సామాన్య ప్రజలు కొత్త నోట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. పెద్ద నోట్లను రద్దు చేసి 9 రోజులు కావస్తున్నా ఇంకా జనం బ్యాంకుల ముందు బారులు తీరి కనబడుతున్నారు. అసలు ప్రధాని తీసుకున్న నిర్ణయం ఎవరికి ఫలితాలనిస్తుంది... ఎవరిని హింసిస్తుంది అనే ప్రశ్నలపై ఇపుడు చర్చ సాగుతోంది. 
 
ముఖ్యంగా నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు బజారున పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బ్యాంకులు ముందు పడిగాపులు పడుతున్నారు. తాము కష్టించి సంపాదించిన డబ్బును వాడుకునే వీలు లేకపోవడంతో లోలోన తిట్టుకుంటూ ఉన్నారు. మరోవైపు ప్రధాని నిర్ణయం తమకు ఏదయినా మేలు చేస్తుందేమోనని ఆశగా మాట్లాడుతున్నారు. ఐతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న బడా వ్యాపారులకు చెందిన రూ. 7000 కోట్ల అప్పును ఎస్బీఐ ఒక్క దెబ్బతో మాఫీ చేసేసింది. 
 
బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యుడు షాక్ తిన్నాడు. రేయనకా పగలనకా కష్టించి కూడబెట్టుకున్న తమ పాతనోట్లకు గండం ఏర్పడితే... కోటాను కోట్లు అప్పు తీసుకుని ఎంచక్కా మాఫీ చేయించుకుంటున్న బడా బాబుల వైనం చూసి షాక్ తింటున్నారు. బ్యాంకులు తమ పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటాయి కానీ ఇలాంటి వారిని ఎందుకు అలా వదిలేస్తుంటాయో అర్థం కాని ప్రశ్నలుగా మారుతున్నాయని వారు అంటున్నారు.

అవినీతిని నిర్మూలించేందుకు నోట్ల రద్దు అని చెప్పిన ప్రధానమంత్రి మోదీ... మరి ఇలాంటి మాల్యాల నుంచి తీసుకున్న డబ్బును ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలామాటకు వస్తే నల్లధనం అంతా ఎప్పుడో బంగారం, భూముల రూపంలోకి మారిపోయిందని రాజకీయ నేతలే చెపుతున్నారు. అలాంటప్పుడు మోదీ నిర్ణయంతో జరిగే మంచి ఏమిటి? సామాన్యులు నడిరోడ్డుపై ఎండలో నిలబడి తమ డబ్బు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయడమేనా?
 
మరోవైపు తాము సంపాదించుకున్న డబ్బును తమ ఇష్టం వచ్చినట్లు బ్యాంకుల నుంచి తమ అవసరం వచ్చినంత తీసుకునే స్వేచ్చ ఇవ్వకుండా దానికి నియమనిబంధనలు విధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సామాన్యులను హింసిస్తుందా... అనే ప్రశ్నలు కడా ఉదయిస్తున్నాయి. పాలకులు సామాన్యులను ఎలా ఆదుకుంటారో... కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి దర్జాగా ఆ సొమ్మును అనుభవిస్తున్నవారి పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రస్తుతం నిర్ణయాలే సాక్ష్యాలుగా కనబడుతున్నాయి.