బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (11:33 IST)

జగన్ ఓదార్పు యాత్ర.. రాహుల్ భరోసా యాత్ర.. సేమ్ టు సేమ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు.. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రకు పెద్దగా తేడా లేదని... అంతా సేమ్ టు సేమ్ అంటూ టాక్ వస్తోంది. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్, బాధితుల ఇళ్లల్లో నేలపై కూర్చుని, వారు పెట్టిందే తిని, వారితో సుదీర్ఘంగా మాట్లాడి వచ్చేవారు. అచ్చం అలాంటి పరామర్శలే ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నాయి. 
 
'రైతు భరోసా' యాత్ర పేరిట ఆదిలాబాదు జిల్లా కొరిటికల్ గ్రామంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వర్ ఇంటిలోపలికి వెళ్లిన రాహుల్, నేలపై కూర్చుని రాజేశ్వర్ భార్య, కుమారుడితో సుదీర్ఘంగా మాట్లాడారు. రాజేశ్వర్ కుమారుడిని ఆప్యాయంగా భుజం తట్టారు. రాజేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. అధైర్యపడొద్దని, అండగా నిలుస్తామని వారికి భరోసా ఇచ్చారు.
 
మరోవైపు ఆదిలాబాదు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తూ వెళుతూనే ఆయా కుటుంబాలకు ఆర్థికంగానూ చేయూతనందిస్తున్నారు. కొరిటికల్ గ్రామంలో వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్, ఆ కుటుంబానికి రూ.2 లక్షలను అందజేశారు. అదేవిధంగా లక్మణచాందలో ఆత్మహత్య చేసుకున్న లింగయ్య కుటుంబానికి కూడా ఆయన రూ.2 లక్షల మేర ఆర్థిక సహాయం చేశారు.