శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (16:47 IST)

దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం... 2014 తర్వాత బీజేపీ హవా

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హవా కొనసాగుతోంది. ముఖ్యంగా, 2014 నుంచి బీజేపీ దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు.

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం కొనసాగుతోంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హవా కొనసాగుతోంది. ముఖ్యంగా, 2014 నుంచి బీజేపీ దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. 
 
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కేవలం ఐదు రాష్ట్రాల్లో (గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాగాలాండ్)నే అధికారంలో ఉండేది. 2014 ఎన్నిలతోపాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అటు సిక్కింలో అధికారంలోకి వచ్చాయి. 
 
ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో శివసేన సాయంతో అధికారంలోకి రాగా.. అదేసమయంలో హర్యానాలోనూ పాగా వేసింది. ఆ వెంటనే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ విజయేభేరీ మోగించింది. ఆ పిమ్మట 2014లోనే జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రాంతీయ పార్టీ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 
 
అయితే, 2015లో జరిగిన ఎన్నికల్లో బీహార్, ఢిల్లీ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఫలితాలు ప్రధాని మోడీకి ఏమాత్రం మింగుడు పడలేదు. ఆ తర్వాత రెండేళ్లలోనే నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీవైపు మొగ్గు చూపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2016లో 15 ఏళ్ల‌ కాంగ్రెస్ పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టి అస్సాంను కైవసం చేసుకుంది. అదే యేడాది అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 47 మంది ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరడంతో అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. 
 
ఇకపోతే, 2017లో బీజేపీకి బాగా కలిసివచ్చింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. యూపీతోపాటు ఉత్తరాఖండ్‌లోనూ బంపర్ మెజార్టీతో గెలిచింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ, స్థానిక పార్టీల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 
 
ఇప్పుడు తాజాగా గుజరాత్‌లో వరుసగా ఆరోసారి పాగా వేయగా కాంగ్రెస్ చేతిలో ఉన్న హిమాచల్‌ను కూడా చేజిక్కించుకుంది. ఇలా ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కషాయం జెండా రెపరెపలు కనిపిస్తున్నాయి. వచ్చే యేడాది మరో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి.