తెలంగాణలో మావోయిస్టుల కదలికలు... ముగ్గురు మావోల అరెస్టు.. జోరుగా కూంబింగ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి మావోయిస్టుల కదలికలు జోరుగా కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమైన విషయంతెల్సిందే. ఈ ఎన్కౌంటర్ తర్వాత టీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజులుగా కూంబింగ్ చర్యలు చేపట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ మావోయిస్టులు పుంజుకోవడాన్ని పోలీసులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో మావోలపై తెలంగాణ పోలీసులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోలను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు అదే జిల్లాలో మరో ముగ్గురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మావోలతో పాటు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ఓ గ్రామస్థుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తెలంగాణలో జరిగిన తొలి ఎన్కౌంటర్.. కరీంనగర్ జిల్లాలోనూ హైఅలర్ట్ బెల్స్ మోగించింది. వరంగల్లోనే జరిగినా.. మావోయిస్టుల కదలికలతో గోదారి - ప్రాణహిత తీరంలో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. జిల్లాలోనూ ప్రతికార దాడులు ఉండొచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. నిజానికి మావోయిస్టులు లేరు.. రిక్రూట్మెంట్లు లేవు.. ఇక తొందర్లనే ఆ మాటే మాయం అవుతుంది... అని ఇన్నాళ్లు పోలీసులు చెప్పుకొస్తున్న మాట.
కానీ.. తెలంగాణలో జరిగిన తొలి ఎన్కౌంటర్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. చాపకింద నీరులా రిక్రూట్మెంట్లు జరిగిపోయాయి. పోలీసులకు షాకిచ్చే మరో న్యూస్ ఎటంటే ప్రస్తుత రిక్రూట్మెంట్లు విద్యావంతులను టార్గెట్గా చేసుకొని జరుగుతున్నవే. వరంగల్ ఎన్కౌంటర్లో చనిపోయిన లేడి మావోయిస్టు కూడా ఉన్నత చదువులే చదివింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ మావోల చర్యలపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు.