శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జనవరి 2016 (17:06 IST)

నేతాజీ చనిపోయారా.. కర్మకాండలు జరిపించొద్దు.. గాంధీ :: అస్థికలు భారత్‌కు తేవొద్దు... పీవీ

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నేతాజీ రహస్య పత్రాల్లో ఒక్కో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా నేతాజీ మరణించిన విషయాన్ని మహాత్మా గాంధీ ఏమాత్రం నమ్మలేదట. అందుకే నేతాజీకి కర్మకాండలు జరిపించవద్దని కోరినట్టు ఈ రహస్య దస్త్రాల్లో ఉంది. 
 
నేతాజీ మరణ వార్త గురించి, ఆయనతో విమానంలో ప్రయాణించిన హబీబుర్ రెహమాన్, మహాత్మా గాంధీకి చెప్పిన వేళ, ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. "సుభాష్ విమాన ప్రమాదంలో మరణించాడంటే నేను నమ్మను. ఆయన కర్మకాండలు జరిపించవద్దు" అని గాంధీ వ్యాఖ్యానించినట్టు బోస్ కుమారుడు అమియా నాథ్ బోస్ తెలిపినట్టు ఉన్న ఓ ఫైల్ వెలుగులోకి వచ్చింది.
 
దీని గురించి 1995లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో బోస్ అస్థికలను ఏం చేయాలని కోరుతూ జపాన్ నుంచి లేఖ రాగా, దానిపై చర్చించిన పీవీ మంత్రివర్గం వాటిని భారత్‌కు తీసుకురాకూడదని అభిప్రాయపడింది. వాటిని తీసుకువస్తే, ఆయన బతికున్నట్టు నమ్ముతున్న బెంగాల్ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, పైగా ఏ వర్గం నుంచి కూడా ఆయన అస్థికలని తీసుకురావాలని డిమాండ్ రావడం లేదని పీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 'నేతాజీ యాషెస్ ఇన్ టోక్యో' పేరిట ఉన్న నోట్ ఫైల్ విడుదలైంది.