మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (14:35 IST)

చంద్రబాబు దొంగనా? పోలవరం నిధుల ఖర్చుపై మరో కమిటీ.. స్వయంగా నిఘా పెట్టిన మోడీ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మడం లేదా? జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కోసం కేంద్ర ఖర్చు చేస్తున్న నిధుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని వేయడం వెనుక అర

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మడం లేదా? జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం కోసం కేంద్ర ఖర్చు చేస్తున్న నిధుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని వేయడం వెనుక అర్థమేంటి.? పైగా, ప్రాజెక్టుతో పాటు నిధుల ఖర్చుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నిఘా వేయడానికి గల కారణాలు ఏంటి? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే చంద్రబాబును కేంద్ర నమ్మడం లేదన్నట్టుగా తెలుస్తోంది. 
 
ఎందుకంటే మూడేళ్ల తేడాలో పోలవరం అంచనా వ్యయం అనూహ్య రీతిలో పెరిగింది. పెరిగిన అంచనాతో కేంద్రం సంబంధం లేదని చేతులు దులుపేసుకుంది. మరోవైపు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు అండ్ కో ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అదేసమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపైన నమ్మకం సడలినట్లుగా కనిపిస్తోంది. అతి బలవంతంగా పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ తన గుప్పిట్లో పెట్టుకోవడం వెనుక ఆంతర్యమేంటో కేంద్రానికి తెలిసొచ్చింది. అందుకే మరో ఉన్నత స్థాయి కమిటీతో ప్రధాని మోడీనే స్వయంగా పోలవరంపై నిఘా పెట్టారు. ప్రస్తుతం ఉన్న కమిటీలకుతోడు మరో నిఘా కమిటీని ఏర్పాటు చేశారు. అంటే.. ఒక్క పోలవరం ప్రాజెక్టుపైనే ఇది మూడో కమిటీ కావడం గమనార్హం.
 
ఈ కమిటీ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర సర్కార్ ఏవిధంగా ఖర్చు పెడుతోంది? ప్రాజెక్టు కోసమే ఖర్చు పెడుతున్నారా? లేక పక్కదారి పడుతున్నాయా? వంటి విషయాలను నిశితంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మోడీకి నివేదికలు పంపించనుంది. కేంద్ర జలసంఘం సభ్యుడు మన్సూర్ ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ కమిటీలో.. ఐదుగురు సభ్యులు, నలుగురు చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. వీరితో పాటు ప్రాజెక్టు డిజైన్ కమిటీ ఛైర్మన్ కూడా ఇందులో ఉంటారు.
 
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్రమే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా.. చంద్రబాబు పట్టుబట్టి మరీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేలా పావులు కదపడం కేంద్రానికి అనుమానం తలెత్తేలా చేసినట్లుంది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై కేంద్రానికి అనుమానాలు ఉండటం వల్లే ఈ కొత్త కమిటీని వేసిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.