గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (16:57 IST)

చంద్రబాబుకు కేంద్రం సుతిమెత్తని హెచ్చరిక.. ఎందుకు..?

దేశంలోని అందరు ముఖ్యమంత్రుల తీరు ఒకలా ఉంటే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో పెట్టుబడులు కోసం ఆయన నేరుగా పలు దేశాలతో వ్యవహారాలు నడుపుతున్నారు.

దేశంలోని అందరు ముఖ్యమంత్రుల తీరు ఒకలా ఉంటే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో పెట్టుబడులు కోసం ఆయన నేరుగా పలు దేశాలతో వ్యవహారాలు నడుపుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా విదేశాలకు చెందిన వ్యక్తుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు కేంద్రానికి కోపం తెప్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా దలైలామా పట్ల చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారశైలి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చైనాతో దలైలామాకు చాలా కాలంగా విభేదాలు తీవ్రస్థాయిలో నడుస్తున్నాయి. తాము టిబెట్ విడిచివెళ్ళడానికి కారణం కూడా చైనాయేనని దలైలామా పలుమార్లు ఆరోపించారు.
 
ఒక విధంగా దలైలామాను వెనుకేసుకొస్తున్న వారిని చైనా తన శత్రువులుగా చూస్తోంది. అయితే ఇటీవల చైనాతో మంచి సంబంధాల కోసం మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దౌత్యవేత్తలను కూడా చైనాతో చర్చలకు పంపించడం, మోడీ కూడా చైనాతో నేరుగా చర్చలు సాగిస్తుండడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇటీవల మహిళా సదస్సుకు దలైలామాను రాష్ట్ర అతిథి హోదాలో మర్యాదలు చేసి గౌరవంగా చూసుకుంది.
 
ఈ వ్యవహారం కేంద్రానికి మాత్రం నచ్చలేదు. ఈ అంశంపై ఆరా తీసిన కేంద్రానికి చెందిన పెద్దలు తాము చైనాతో మంచి వాతావరణం మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుంటే మీరు ఇలా దలైలామాను ప్రత్యేకంగా ఆహ్వానించడం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూసే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు హద్దులు దాటడం సరికాదని సూచించినట్లు సమాచారం. అయితే తాము మంచి ఉద్దేశంతోనే దలైలామాను ఆహ్వానించామని మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆచితూచి వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇచ్చిందట. మొత్తం మీద బాబుకు సుతిమెత్తగా కేంద్రం హెచ్చరిక చేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.