గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (18:37 IST)

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీ..? (video)

2019 ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపుతో విసిగిపోయిన ప్రజలు.. ప్రత్యామ్నాయ పార్టీని గెల

2019 ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపుతో విసిగిపోయిన ప్రజలు.. ప్రత్యామ్నాయ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పీఎం అవుతారని భారత బిగ్ బుల్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా వ్యాఖ్యానించారు.
 
ఓ ఇంటర్వ్యూలో ఝన్‌ఝన్‌వాలా మాట్లాడుతూ.. విపక్షాలకు ఏ విధమైన అజెండా లేకుండా పోయిందని ఆరోపించారు. కేవలం నరేంద్ర మోదీని ఓడించడమే అజెండాగా వారు సాగుతున్నారని, ఈ క్రమంలో విజయం సాధించలేరని జోస్యం చెప్పారు. బీజేపీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని, కానీ మోదీ మళ్లీ ప్రధాని అయ్యేది మాత్రం ఖాయమని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అనారోగ్య కారణాలతో ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఒక్కరే పార్టీని నడుటం కష్టం. అందుకే వచ్చే ఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలోకి దించేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారట. 
 
2019 ఎన్నికల్లో రాయ్ బరేలీ లేదా వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ప్రియాంకాగాంధీ అనుకుంటున్నారని తెలిసింది. రాయ్‌బరేలీ కంటే వారణాసి వైపే ప్రియాంక మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మోడీని ఓడించి… తన రాజకీయ ఆరంగేట్రాన్ని ఓ రేంజ్‌లో చాటాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ నేతలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ నడిపించలేకపోతున్నారని పార్టీలో గుసగుసలు పెరిగాయి. ప్రియాంక వస్తే వ్యూహాలు మారతాయని, రాహుల్ కంటే కూడా ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే వీలుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతల అభీష్టం మేరకు ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది.