శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (20:02 IST)

మాత దీవెనల కోసం శశికళ... తలపై చేయిపెట్టిన మోదీ... జల్లికట్టు స్ఫూర్తితో యూత్ తిష్టవేస్తారేమో?

అన్నాడీఎంకే పార్టీలో ఇప్పుడు అయోమయం రాజ్యమేలుతోంది. ఒకవైపు ఎవరెన్ని చెప్పినా తను ముఖ్యమంత్రి కావాలన్న మొండిపట్టుదలతో శశికళ ముఖ్యమంత్రిగా వున్న పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు. మద్రాస్ యూనివర్శిటీలో భారీ ఏర్పాట్ల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట

అన్నాడీఎంకే పార్టీలో ఇప్పుడు అయోమయం రాజ్యమేలుతోంది. ఒకవైపు ఎవరెన్ని చెప్పినా తను ముఖ్యమంత్రి కావాలన్న మొండిపట్టుదలతో శశికళ ముఖ్యమంత్రిగా వున్న పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు. మద్రాస్ యూనివర్శిటీలో భారీ ఏర్పాట్ల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కలలు కన్నారు. కానీ ఆ కలలు కల్లలయ్యాయి. ఆమె తీసుకున్న నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో ఆమెపై కేసు వేలాడుతోంది. సుప్రీం తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే పదవికి దూరం కాక తప్పదు.
 
ఇదిలావుంటే బుధవారం నాడు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకు వస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఆయన వస్తున్నారంటే శశికళతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడానికే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇటీవలే జల్లికట్టు కోసం మూకుమ్మడిగా పోరాటం చేసిన తమిళ యువత మరోసారి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకూడదంటూ రోడ్డెక్కుతారేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇక ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీ తన ఎంపీలను కలుపుకుని ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి శశికళ ముఖ్యమంత్రికి అనర్హురాలనీ, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దెనెక్కకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే శశికళ మాత్రం తన ప్రయత్నాలను ఆపడంలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం మాతా అమృతానందమయిని కలిసి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆమె దీవెనలు అందుకున్నారు. మరి శశికళ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.