శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (12:40 IST)

షీనా బోరా కేసు : విలాసవంతమైన జీవితం కోసం వావివరసలకు పాతరేసిన ఇంద్రాణి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా కేసులో ఇపుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముంబై పోలీసులు పైపైనే దర్యాప్తును పూర్తి చేశారు. కానీ, ఈ కేసు విచారణ సీబీఐకు చేరగానే తీగలాగితే డొంకంతా కదిలిన చందంగా రోజుకో రకమైన సంచలనం, ఆధారం వెలుగు చూస్తోంది. వెరసి.. విలాసవంతమైన జీవితం కోసం ఇంద్రాణి ముఖర్జియా ఆడిన ఓ నాటకంలో రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్, మూడో భర్త పీటర్ ముఖర్జియాలు ప్రధాన పాత్ర పోషించారు. ఫలితంగా ఓ యువతి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈ విషయం కాస్త.. ఆలస్యంగా వెలుగు చూడటంతో వీరంతా ఇపుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఇంద్రాణి ముఖర్జియా ఆడిన నాటకాన్ని, ఇందులో పాత్రధారుల వివరాలను పరిశీలిస్తే... 
 
ఇంద్రాణికి ఒకటి కాడు రెండు కాదు ఏకంగా మూడు పెళ్ళిళ్లు. కాలేజీ వయసులోనే అంటే 1986లోనే సిద్ధార్థ్  దాస్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరు షీనా బోరా కాగా, మరొకరు మిఖాయిల్ బోరా. భర్తను, పేగుతెంచుకుపుట్టిన ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆశల రెక్కలు తొడుక్కుని మరో ప్రపంచం విహరించాలని కలలుకంది. అంతే.. సిద్ధార్థ్‌కి గుడ్‌బై చెప్పి కోల్‌కతాలో వాలిపోయింది. అక్కడే సంజయ్‌ ఖన్నాతో పరిచయం ఏర్పడి రెండో పెళ్లి చేసుకుంది. వీరికి విధి అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత 2001లో ముంబై చేరుకున్నాక ఇంద్రాణి ఆలోచనలే పూర్తిగా మారిపోయాయి. అక్కడే మీడియా టైకూన్‌ పీటర్‌ ముఖర్జీతో పరిచయం ఏర్పడింది. ఫలితంగా సంజీవ్‌తో విడాకులు తీసుకోకుండానే పీటర్‌ ముఖర్జీని పెళ్ళాడింది. దీనికంతటికీ కారణం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలన్న బలమైన కోర్కె ఆమెను ఆ విధంగా ప్రేరేపించింది. 
 
పీటర్‌ భార్యగా కార్పొరేట్‌ ప్రపంచంలో కాలుమోపాక ఇంద్రాణి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ జీవితం ఇదేవిధంగా అనుభవించాలన్నా... కొనసాగాలన్నా.. తనకు మొదటి భర్త సిద్ధార్థ్ ద్వారా ఇద్దరు పిల్లులున్నారనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచాలని భావించింది. ఆ ప్రకారంగా తన సంతానాన్ని కన్నబిడ్డలనికాక తోడబుట్టినవాళ్ళలా సమాజానికి పరిచయం చేసింది. పాత ఇంద్రాణి ఇకపై కనిపించకూడదన్న లక్ష్యంతోనే ఆమె ప్రతి అడుగూ అత్యంత జాగ్రత్తతో వేసింది. అయితే, షీనా బోరా ముంబైకు వచ్చాక... ఇంద్రాణి గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. అయినా కూతురినని ఎక్కడా చెప్పొద్దని ఆంక్షలు పెట్టి చెల్లెలిగానే తన కార్పొరేట్ సమాజానికి పరిచయం చేసింది. తన మూడో భర్త పీటర్‌కు కూడా అదే చెప్పింది.
 
ఇక్కడ నుంచే కథ.. ఇంద్రాణి ఊహించని మలుపుతిరిగింది. పీటర్‌ కుటుంబంలోకి అడుగుపెట్టాక... అతని కుమారుడు రాహుల్‌తో షీనా బోరా ప్రేమలో పడిపోయింది. పెద్దవాళ్ళు వారించేకొద్దీ వీరిద్దరి ప్రేమబంధం అంత దృఢంగా బలపడింది. మరదలని మొదట అనుకున్న షీనా... ఆ తర్వాత ఇంద్రాణి కుమార్తె అని తెలిసి షీనాకు దూరంకావాలని తన కుమారుడు రాహుల్‌ ముఖర్జియాను పీటర్‌ హెచ్చరించారు. ఇక ఇంద్రాణికి అయితే రాహుల్‌ - షీనాల బంధాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది. కూతుర్తెను నయానోభయానో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికీ రాహుల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన షీనా.. తల్లి మాట వినలేదు కదా.. తల్లికే ఎదురుతిరిగింది. 
 
తనని కట్టడిచేస్తే తాను కూతురిననే విషయం బయటపెడతానని మొండిగా చెప్పేసింది. పైగా.. నీకు నచ్చిన దాన్ని నీవు చేస్తే.. నాకు సంతోషం ఇచ్చేదాన్ని నేను వెతుక్కున్నా ఇందులో తప్పేంటి అని ప్రశ్నించింది. అపుడే.. షీనా జీవించి ఉంటే.. తనకు ఎపుడైనా ప్రమాదం తప్పదని పసిగట్టిన ఇంద్రాణి.. ఆమెను శాశ్వతంగా లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుని, తన రెండో మాజీ భర్త, కారు డ్రైవర్ సాయంతో ఆ పని పూర్తి చేసింది. ఇదంతా ముందే తేలిసిన పీటర్ ముఖర్జియా.. షీనా బోరా హత్య జరిగే సమయానికి విదేశాలకు వెళ్లిపోయి.. తనకేం తెలియనట్టుగా మేకవన్నె పులిలా నటించినట్టు ఆయన అరెస్టుతో తేలిపోయింది. ఇక ఈ కేసులో రాహుల్ ముఖర్జియా, షీనా సోదరుడు మిఖాయిల్ బోరా పాత్రలను సీబీఐ నిర్ధారించాల్సి వుంది.
 
 
నిజానికి... ఆరంభంలోనే తమ రక్త సంబంధాల గురించి చెప్పివున్నట్టయితే ఇన్ని అనర్థాలు జరిగివుండేవి కాదేమో. ఇది విధి ఆడిన వింత నాటకం కాదు కూడా. స్టేటస్‌ ముసుగులో ఎవరికి వారు నాటకాన్ని రక్తికట్టించారు. ఎవరికేం తెలియనట్లే జీవించారు. ఇంద్రాణి మొదలుపెట్టిన నాటకంలో విలువల వలువలు ఒలిచేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తున్న ఓ అమ్మాయి జీవితం అర్థంతరంగా ముగిసిపోడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానే కారకులయ్యారు. 
 
పైగా, కన్నబిడ్డే కంట్లో నలుసులా మారిందనే అక్కసుతో ఇంద్రాణి, షీనా అడ్డుతొలిగితే తన కూతురి భవిష్యత్‌ బాగుంటుందనే అత్యాశతో రెండో భర్త సంజీవ్‌ ఖన్నా, ఇచ్చింది జేబులో వేసుకుని పాపంలో భాగం పంచుకున్న కారుడ్రైవర్ శ్యామ్ రాయ్, ఈ ముగ్గురు కలిసి మూడేళ్ళపాటు ఓ సంచలనాన్ని తొక్కిపెట్టారు. తెలిసినా ఏమీ తెలియనట్లే పీటర్ ముఖర్జియా, షీనా సోదరుడు మిఖాయిల్ బోరా, షీనా ప్రియుడు రాహుల్ ముఖర్జియా నటించారు. అసలీ సంఘటన ఇంతకాలం ఎలా మరుగునపడటానికి కారణం.. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా.. తమతమ పాత్రలను రక్తి కట్టించడమే.