మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (13:51 IST)

పులి-మేక కాదు... పులి-పాము... తిరుమల కొండపై ఆడుకుంటున్నాయ్...

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమలకు ప్రతిరోజు వేలల్లోనే భక్తులు వస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత నెలరోజులుగా తిరుమలకు రావాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. అసలు తిరుమలకు వెళదామా.. వద్దా అన్న ఆలోచనలో పడిపోతున్నారు భక్తులు. ఎలాంటి సంధర్భాల్లోనైనా

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమలకు ప్రతిరోజు వేలల్లోనే భక్తులు వస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత నెలరోజులుగా తిరుమలకు రావాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. అసలు తిరుమలకు వెళదామా.. వద్దా అన్న ఆలోచనలో పడిపోతున్నారు భక్తులు. ఎలాంటి సంధర్భాల్లోనైనా మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తులు ప్రస్తుతం ఈ క్షేత్రానికి రావాలంటే ఎందుకు భయపడిపోతున్నారు..? కారణం..ఏమిటి. .అయితే ఈ కథనం చూడండి.
 
గత నెలరోజులుగా తిరుమలలో ఒకవైపు చిరుతలు, మరోవైపు నాగుపాములు తిరుగుతుండటం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. అది కూడా ప్రతిరోజు జనావాసాల మధ్యే తిరుగుతుండటంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చిరుత బాలాజీనగర్‌ సమీపంతో పాటు హెచ్‌.డి.కాంప్లెక్స్ వెనుక ఉన్న పార్కింగ్‌ ఏరియా, జిఎన్‌సి, మఠాల సమీపంలో తిరుగుతూ కనిపించింది. భక్తులే చిరుతపులిని చూసి తితిదే, అటవీశాఖాధికారులకు సమాచారం కూడా అందించారు. అయితే తాపీగా అక్కడకు వచ్చే అటవీశాఖాధికారులు ఏమీ లేదంటూ చెప్పి వెళ్లిపోతున్నారు.
 
గత రెండురోజులకు ముందు భక్తులు ఎప్పుడూ తిరుగుతూ ఉండే హెచ్‌.డి.కాంప్లెక్స్ కు సమీపంలోనే చిరుత ఒక జంతువును చంపడంపై మాత్రం భక్తుల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో స్వయంగా తితిదే ఇవో చిరుతలు సంచరించిన ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి వెంటనే బోన్లను ఏర్పాటు చేయాలని అటవీశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికీ ఒక బోనును మాత్రమే అటవీశాఖ ఏర్పాటు చేసింది. మరో రెండు బోన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. భక్తులకు ఇప్పటివరకు మూడుకుపైగా చిరుత పులులు కనిపించాయి. అయితే అటవీశాఖాధికారులు ఒకే ఒక బోను పెట్టడం విమర్శలకు తావిస్తోంది. 
 
అసలు చిరుత సంచరించేటపుడే పట్టించుకోవాల్సిందిపోయి ఇప్పుడు బోనులు పెట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నాగుపాములు ఎక్కడబడితే అక్కడ పాకుతూ తిరుమల భక్తులను భయపెడుతున్నాయి. అతిథి గృహాలు గేట్లు తీస్తే చాలు బుస్ మంటూ పాములు బుసలు కొడుతున్నాయి. ఇప్పటికే మూడు పాములను పట్టి అడవిలోకి వదిలారు. అవి కూడా 10 అడుగులు ఉన్న నాగుపాములు. భక్తుల మధ్యే ఈ నాగుపాములు తిరుగుతుండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే వాటిని పట్టి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు అటవీశాఖాధికారులు. 
 
తిరుమలలో నాగుపాములు, చిరుతలు తిరుగుతున్నాయన్న విషయాన్ని మీడియా, పత్రికల ద్వారా చూస్తున్న భక్తులు తిరుమలకు రావడమే మానేస్తున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. తిరుమల లాంటి క్షేత్రం భక్తులు లేకుండా ఉండటం అరుదుగా చెప్పుకోవచ్చు. ఏ సమయంలోనైనా భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతం తిరుమల. అలాంటి ప్రాంతం ప్రస్తుతంలో భక్తులు తక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా తితిదేతో పాటు అటవీశాఖాధికారులు చిరుత పులులను పట్టుకోకుంటే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.