విజయవాడ : మామూలుగా ప్రభుత్వ టెండర్ అంటే కాంట్రాక్టర్లు భయపడతారు. లెక్కకు మించిన షరతులుంటాయని... కానీ అమరావతి రాజధాని నిర్మాణంలో కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థలు.. అంటే సింగపూర్ కంపెనీలు ప్రభుత్వానికి లెక్కలేనన్ని ‘కండిషన్లు’ పెట్టాయి. వాటికి చంద్రబాబు సర్కారు సరేనంది. అంతా స్వీస్ ఛాలెంజ్ అని చెపుతున్నారు. దీనికి ప్రతిపక్షాలు స్పందిస్తూ, అంతా సీక్రెట్గా చేస్తున్నప్పుడు అసలు ‘ఛాలెంజ్’ ఎక్కడుంది?. ఎవరైనా పోటీ పడాలంటే అసలు ఛాలెంజ్ ఏంటో.. ఆట ఏంటో తెలియాలి కదా. కానీ ఇక్కడ అంతా ‘సీక్రెట్ కవర్’లో పెట్టారు. సీక్రెట్ కవర్లో పెట్టిన ‘రెవెన్యూ షేరింగ్’ను ఎవరైనా ఎలా ఛాలెంజ్ చేస్తారు.
అందరూ ఎంత ఆదాయం ఇస్తారో సీల్డ్ కవర్లలో ఇచ్చాక… అందరి సమక్షంలో సింగపూర్ కంపెనీల కవర్ కూడా తెరుస్తారట. వంద శాతం వాటాలు కలిగి ఉన్న సింగపూర్ ప్రభుత్వ కంపెనీలే రాజధాని కడతాయని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వ వాటాలు మాత్రమే ఉన్న కంపెనీలు రంగంలోకి దిగాయి. స్విస్ ఛాలెంజ్ అంటే ప్రతిపాదిత ప్రాంతంలో తాము ఏమి చేస్తామో కంపెనీలు ప్రతిపాదనలు ఇవ్వాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థలతో ప్రభుత్వం పలుమార్లు బేరాలు జరిపింది.
ప్రతిపాదనలు సింగపూర్ కంపెనీలవి అయితే.. సీఆర్డీఏ మౌలిక సదుపాయాల కల్పనకు 5,500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఎలా లెక్కలేసిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భూమి ఇవ్వటమే కాకుండా.. 5,500 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించినా కూడా ప్రభుత్వం ఎవరికైనా ఈ ప్రాంతంలో భూమి కేటాయించాలంటే మళ్ళీ సింగపూర్ సంస్థలనే ఆశ్రయించాలట. మార్కెట్ రేటు చెల్లించాల్సిందేనట. అంటే మన భూమిని.. మౌలికసదుపాయాల కల్పన చేసి మళ్ళీ.. మనం కొనుక్కోవాలన్నమాట. సింగపూర్ దందాకు మనం మౌలిక సదుపాయాలు కల్పించటం ఎందుకు?. బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి.
5500 కోట్ల రూపాయలతో మౌలికసదుపాయాల కల్పన సాధ్యంకాదన్న ఆర్థిక శాఖ అభ్యంతరాలు బేఖాతరు చేస్తున్నారు. మన భూమిని సింగపూర్ సంస్థలు తనఖా పెట్టుకుని రుణం తీసుకునే ప్రభుత్వం గ్యారెంటీ ఎందుకు ఇవ్వాలన్న ఆర్థిక శాఖ అభ్యంతరాలను పక్కన పెట్టి సింగపూర్ సంస్థలకు సలాం కొట్టారు. సింగపూర్ సంస్థల స్విస్ ఛాలెంజ్ విధానానికి మంత్రవర్గం ఆమోదం తెలిపినా… చాలామంది మంత్రులకు అసలు ఇందులో ఏమి జరుగుతుందో తెలియదు. అంతా ఓకే కదా అని చంద్రబాబు కేబినెట్ తతంగాన్ని పూర్తి చేశారు.
ఒక్క చంద్రబాబు నాయుడు.. యనమల రామకృష్ణుడు మాత్రమే ఇందులో పూర్తిగా భాగస్వాములు అయ్యారు. యనమల నేతృత్వంలో హైపవర్ కమిటీ వేసినా సింగపూర్ సంస్థలతో చంద్రబాబు నాయుడే ఫోన్లో మాట్లాడి ‘సెటిల్’ చేసుకున్నారని హైపవర్ కమిటీ మినిట్స్ లోనే పేర్కొన్నారు.
ఇప్పుడు 1691 ఎకరాల్లో 3,137 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చేది పూర్తిగా బిజినెస్ డ్రిస్ట్రిక్ట్.. వాణిజ్య సముదాయాలు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రమే. మరి సింగపూర్ రాజధాని అని చెప్పి.. మరి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. హెచ్వోడీ కార్యాలయం ఎవరితో కట్టిస్తారు? అనేది ప్రశ్న.
అన్నీ ప్రభుత్వమే చేసి పెట్టాలట... అదీ సింగపూర్ టెక్నిక్!
రాజధానిలో అన్ని రహదారులు ప్రభుత్వమే నిర్మించాలి. తాగు నీటి శుద్ధి కర్మాగారాలు, అన్ని చోట్లకు నీటి పంపిణీకి పైప్ లైన్లు ప్రభుత్వమే నిర్మించాలి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ప్రభుత్వమే నిర్మించాలి. అక్కడ పచ్చదనం, పార్కులు, చెట్లు, పుట్టలు ప్రభుత్వమే భరించాలి. మళ్ళీ వీటన్నిటికీ టైం లైన్లు, వాటిని మీటవ్వకపోతే ప్రభుత్వమే పెనాల్టీ కట్టాలి. ఇలా మొత్తం షుమారు 5,500 కోట్లు (ప్రస్తుత ఎస్టిమేషన్ ప్రకారం) ప్రభుత్వం ఖర్చు పెడితే, తర్వాత సింగపూర్ కంపెనీ వారు 300 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులు కడతారు.
వీటికి కూడా ప్రభుత్వం మట్టి, ఇసుక వంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ఉచితంగా ఇవ్వాలి. అంతే కాదు, విద్యుత్తు, పన్ను రాయితీలు ఇవ్వాలి. మధ్యలో ఎప్పుడైనా ఏదేని కారణాలతో వారు ప్రాజెక్టు నుంచి వైదొలిగితే వారు అప్పటికి ఎంత ఖర్చు పెట్టారో అని వారు చూపిన దాని ప్రకారం మొత్తం తిరిగి ఇచ్చి, పైన వారికి కొంత అధికంగా ముట్ట చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఎకరా 4 కోట్లు అని ఎస్టిమేట్ వేస్తోంది. రేపు ఆ ప్రాంతంలో మరెవరికైనా అంతకన్నా తక్కువ ధరకు భూమి ఇస్తే, ఆ తేడా సింగపూర్ కంపెనీలకు తిరిగి కట్టాలి. ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులలోనే తేల్చుకోవాలి.
మొదటి దశలో (ఇప్పటి నుంచి పదేళ్ల లోపు) బిజినెస్ పార్క్ కడతారట, రెండో దశ (పదేళ్ల తర్వాత, 20 ఏళ్ల లోపు) ప్రభుత్వ భవనాలు కడతారట. మూడో దశలో ఎకో రిసార్ట్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కడతారట. ఇదీ మన అమరావతి రాజధాని నిర్మాణ విచిత్రాలు.