శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:46 IST)

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి... శశికళ - పన్నీర్ సెల్వం మధ్యలో స్టాలిన్!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. "ఓ కోతి.. రెండు పిల్లలు" రొట్టె కథలా ఇపుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల పరిస్థితి మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. "ఓ కోతి.. రెండు పిల్లలు" రొట్టె కథలా ఇపుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల పరిస్థితి మారింది. కానీ, మధ్యలో 97 మంది ఎమ్మెల్యే మద్దతు (డీఎంకే 89, కాంగ్రెస్ 8)తో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అవకాశం కోసం కోతిలా కాచుకూర్చొన్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాలిట్రిక్స్ ఉత్కంఠభరితమైన ట్వంటీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. 
 
క్రికెట్‌లో కప్పు కోసం పోరు ఇరు జట్లు తలపడిదే.. ఇక్కడు ముఖ్యమత్రి కుర్చీ కోసం కోసం శశికళ, పన్నీరు సెల్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, రోడ్లపై కాకుండా అసెంబ్లీ వేదికగా బల నిరూపణకు సిద్ధమని పన్నీర్ సెల్వం బాహాటంగా ప్రకటించారు. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. శశికళ మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
వీరిద్దరి ప్రకటనలను పక్కనబెడితే... వాస్తవ పరిస్థితులు మాత్రం శశికళకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం పది గంటలకు సమావేశానికి రావాల్సిందిగా శశికళ ఇచ్చిన పిలుపుకు మద్దతు కరువైంది. అన్నాడీఎంకేలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో శశికళ సమావేశాన్ని ఓ గంటపాటు వాయిదా వేశారు. ఈ సమావేశానికి శశికళ వర్గం 130 మంది వచ్చారని చెపుతుంటే.. వాస్తవానికి 123 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారన్నది పన్నీర్ వర్గ నేతలు చెపుతున్నారు. అయితే సమావేశానికి హాజరైన ఈ ఎమ్మెల్యేలంతా ఆమెకు మద్దతు ఇస్తారని చెప్పలేం. ఒకవేళ ఈ 123 మంది మద్దతిస్తే మాత్రం పన్నీరు సెల్వంకు గడ్డు కాలమనే చెప్పాలి. 
 
కానీ, డీఎంకేకు చెందిన 89 మంది ఎమ్మెల్యేలుగానీ పన్నీర్ సెల్వంకు మద్దతిస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికే ఎంకే.స్టాలిన్ కూడా పన్నీరు సెల్వం వైపే మొగ్గుచూపుతున్నారన్నది బహిరంగ రహస్యం. అదీఇదీకాకుండా అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు స్టాలిన్ ఆకర్షించగలిగితే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవచ్చు. డీఎంకేకు చెందిన 89 మంది, 8 మంది కాంగ్రెస్, 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలుపుకుని 119 మంది సభ్యులతో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. 
 
ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్లు 234. ఇందులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 135 మంది. డీఎంకే ఎమ్మెల్యేలు 89. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. 8. ఐయూఎమ్‌ఎల్ 1. జయలలిత మరణంతో ఆర్‌కే నగర్ ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉంది. ఇవీ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో పార్టీల బలాబలాలు. ఈ లెక్కల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శశికళ వర్గానికి గానీ, పన్నీరు వర్గానికి గానీ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ 118 ఎమ్మెల్యేలు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేదాని పైనే తమిళనాడు సీఎం ఎవరనే విషయం తేలనుంది.